కరోనా వైరస్ భయంతో సాటి మనిషి రోడ్డుపై చలనం లేకుండా పడి ఉన్నా.. సాయం చేసేందుకు జనం భయపడుతున్నారు. ఢిల్లీలో ఓ బిజీ రోడ్డులో 65 ఏళ్ల వృద్ధుడు పడిపోయి ఉంటే.. ఏమైందని వెళ్లి చూసేందుడుకు ఎవరూ ధైర్యం చేయలేదు. దాదాపు మూడు గంటలపాటు అలానే ఉండగా.. ఎట్టకేలకు చివరికి పీపీఈ కిట్ వేసుకుని వచ్చి పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలతో లేడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఢిల్లీలోని యూసఫ్ సరాయ్ మార్కెట్ ప్రాంతంలో జరిగింది.
ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో గతంలో అటెండర్ గా పని చేసిన 65 ఏళ్ల వృద్ధుడు… యూసఫ్ సరాయ్ వద్ద బుధవారం మధ్యాహ్నం మండిపోయే ఎండలో స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. కానీ ఎవరూ అతడి దగ్గరకు వెళ్లి చూసేందుకు కూడా ధైర్యం చేయలేకపోయారు. అతడికి కరోనా వైరస్ సోకి ఉంటుందేమోనన్న భయంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. చాలా గంటల తర్వాత పీపీఈ కిట్లు ధరించి అక్కడికి వచ్చిన పోలీసులు లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడు మరణించినట్లు చెప్పారు.