- వారం క్రితం 1,157.. ఇప్పుడు 1,381 మంది
- ఆక్సిజన్పై 546 మంది.. ఐసీయూలో 429 మంది
- గాంధీలో 3 రోజుల్లో 26 మంది చేరిక
- ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దని డాక్టర్ల సూచన
- డెల్టా ముప్పు కూడా పోలేదని వెల్లడి
- కేసులు పెరిగితే ఇన్పేషెంట్లూ పెరుగుతారని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా ఇన్పేషెంట్లు పెరుగుతున్నరు. వారం క్రితం ఆస్పత్రుల్లో ఉన్న కరోనా పేషెంట్ల సంఖ్య 1,157 కాగా.. ఇప్పుడది 1,381కి పెరిగింది. ఇందులో 546 మంది ఆక్సిజన్ సపోర్ట్పై చికిత్స తీసుకుంటున్నారు. మరో 429 మంది ఐసీయూలో ఉన్నారు. వారం క్రితం దాకా రోజుకు సగటున నలుగురైదుగురు పేషెంట్లే ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పుడు గత 3 రోజుల్లోనే హైదరాబాద్ గాంధీ దవాఖానలో 26 మంది కరోనా పేషెంట్లు చేరారు. అయితే, రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కేసులతో పోలిస్తే.. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఇన్పేషెంట్లు పెరుగుతున్నారని, కేసులు పెరిగేకొద్దీ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఒమిక్రాన్ సోకిన ప్రతి వంద మందిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆస్పత్రిపాలయ్యే అవకాశం ఉందని హెల్త్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. అందుకు తగ్గట్టు బెడ్లు, మెడిసిన్ను సిద్ధం చేసి పెట్టుకుంది. సెకండ్ వేవ్ పీక్ స్టేజ్లో రాష్ట్రంలో అత్యధికంగా ఒకే రోజు 24 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈసారి పీక్లో అంతకుమించి కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రోజూ హాస్పిటళ్లలో చేరేవారి సంఖ్య 600 నుంచి 800 మధ్య ఉండొచ్చని అంటున్నారు. కేసుల సంఖ్య, వైరస్ తీవ్రతను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.
లైట్ తీసుకోవద్దు
రాష్ట్రంలో కరోనా ఆంక్షలు ఉండవని, సినిమాలు..షికార్లకు పోవాల్నో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పి ప్రభుత్వం వదిలేసింది. మరోవైపు, ఒమిక్రాన్ సోకినా ఎవరికీ ఏంకావట్లేదన్న ప్రచారం కూడా జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. దీంతో కేసులురోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. అయినా జనం లైట్ తీస్కుంటున్నారు. ఎప్పటిలాగానే హోటళ్లు, బార్లు, మాల్స్కు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్తో కూడా జనాలు హాస్పిటళ్లలో చేరుతున్నారని, ప్రాణాలు కూడా కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్వో సైతం ప్రకటించింది. అమెరికా, బ్రిటన్లలో లాగా మన దగ్గరకూడా ఒకేసారి లక్షల్లో కేసులు పెరిగితే హెల్త్ సౌలతులపై భారం పెరిగే ప్రమాదం ఉందని, బెడ్ల కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేరే జబ్బులతో బాధపడేటోళ్లపై ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
డెల్టా ముప్పు పోలె
సెకండ్వేవ్లో పరిస్థితి సీరియస్ అవ్వడానికి కారణమైన డెల్టా వేరియంట్ ముప్పు కూడా ఇంకా పోలేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడొస్తున్న కేసుల్లో 30% డెల్టావే ఉండొచ్చని ఇటీవల పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే తప్ప ఒమిక్రాన్ సోకిందా? డెల్టానా? అన్నది తేల్చడం కష్టం. వేల సంఖ్యలో కేసులొస్తే అందరికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడమూ అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో లైట్ తీస్కుంటే ముప్పును కొనితెచ్చుకున్నట్టేనని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు. డెల్టా సోకినవారిలో లక్షణాలు బయటపడిన వారం తర్వాతే వారి ఆరోగ్యం సీరియస్ అయిందని, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
లైట్ తీస్కోవడం చాలా డేంజర్
ఒమిక్రాన్తో వచ్చే ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువేనని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి రావడం చాలా ప్రమాదకరమైన విషయం. తక్కువ సంఖ్యలోనే అయినా ఒమిక్రాన్ పేషెంట్లూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఐసీయూ కేర్ అవసరమవుతోంది. ఇప్పుడిప్పుడే మరణాలూ నమోదవుతున్నట్టు తెలుస్తోంది. వేరే జబ్బులతో బాధపడేవారికి ఒమిక్రాన్ ముప్పు ఎక్కువగానే ఉంటుంది. పాజిటివ్ కేసుల్లో ఒక శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చినా.. సెకండ్ వేవ్ తరహాలో కష్టాలు తప్పకపోవచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎడం పాటించాలి. వ్యాక్సిన్ను తప్పకుండా వేసుకోవాలి.
- డాక్టర్ కె. హరిప్రసాద్, ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్