- ఐసోలేషన్లోకి క్యాపిటల్స్ టీమ్
- నేడు ఆర్సీబీతో మ్యాచ్పై డైలమా!
ముంబై: ఫ్యాన్స్ సమక్షంలో ఫుల్ జోష్లో నడుస్తున్న ఐపీఎల్ 15వ సీజన్లో కరోనా కలవరం మొదలైంది. పటిష్టమైన బయో బబుల్లోకి వైరస్ ప్రవేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్ పాజిటివ్గా తేలడంతో ఆ టీమ్ అంతా ఐసోలేషన్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో శనివారం ఆర్సీబీతో ఢిల్లీ మ్యాచ్పై డైలమా నెలకొంది. ‘ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ పాజిటివ్గా తేలారు. ఢిల్లీ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోంది. టీమ్ మొత్తం ఐసోలేషన్లో ఉంది. ఈ రోజు (శుక్రవారం) రెండు టెస్టులు చేశారు. రేపు ఉదయం మూడో టెస్టు చేస్తారు. మరో పాజిటివ్ కేసు రాకుంటే మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. కరోనా వల్ల ఏదైనా టీమ్ ఎఫెక్ట్ అయితే..ఓ సబ్స్టిట్యూట్ సహా కనీసం 12 మంది అందుబాటులో ఉంటే మ్యాచ్ నిర్వహిస్తామని ఈ సీజన్ రూల్స్లో బోర్డు పేర్కొంది. ఒకవేళ 12 మందిని బరిలోకి దించడం సాధ్యం కాకపోతే మ్యాచ్ను రీషెడ్యూల్ చేస్తామని తెలిపింది. గతేడాది పలు టీమ్స్ కరోనా ప్రభావితం అయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి బయో బబుల్ రూల్స్ను బీసీసీఐ కఠినం చేసింది. అయినా తొలి కేసు రావడంతో బీసీసీఐకి షాక్ తగిలింది. కేసులు మరిన్ని పెరిగితే గతేడాది పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని టెన్షన్ పడుతోంది.