- ప్రైవేటు ఆస్పత్రుల్లో 17 వేల దాకా ఖాళీలు
- కార్పొరేట్ కంటే తక్కువకే కరోనా ట్రీట్మెంట్
- 30 వేల రూపాయల నుంచి రోజువారీ ప్యాకేజీలు
- కొవిడ్ వెబ్సైట్లో ప్రైవేట్ హాస్పిటళ్ల బెడ్ల వివరాలు
- కార్పొరేటైనా.. చిన్న ప్రైవేటు దవాఖానైనా సేమ్ ట్రీట్మెంట్
- చిన్న ఆస్పత్రుల్లో ఇప్పటికే ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్మెంట్ కోసం జనం కార్పొరేటు హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. లక్షలు కడుతామన్నా అక్కడ బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. నిజానికి రాష్ట్రంలోని చిన్న ఆస్పత్రుల్లో 17 వేల దాకా బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ చార్జీలతోనే వాటిలో మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే మెజారిటీ పేషెంట్లు చిన్న దవాఖాన్ల వైపు చూడడం లేదు. అందరికీ తెలిసేలా చిన్న హాస్పిటళ్లు మార్కెటింగ్ చేసుకోకపోవడం, వాటిపై జనాలకు ఇప్పటివరకు సరైన అభిప్రాయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. బ్రాండ్ చూసి పోవడమే తప్ప కార్పొరేట్ అయినా, చిన్న హాస్పిటళ్లు అయినా కరోనాకు ఒకటే తరహా ట్రీట్మెంట్ అని అంటున్నారు. ఇప్పటికే వేల మంది కరోనా పేషెంట్లకు చిన్న హాస్పిటళ్లలో డాక్టర్లు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అందించారని గుర్తు చేస్తున్నారు. అనవసరంగా కార్పొరేటు ఆస్పత్రులకు పోయి అప్పుల పాలు కావద్దని సూచిస్తున్నారు.
ఖాళీలు ఇలా..
రాష్ట్రంలో పూర్తిగా కరోనా పేషెంట్ల కోసం గాంధీ ఆస్పత్రి, టిమ్స్ను ప్రభుత్వం కేటాయించింది. కేసులు పెరగడంతో కరోనా ట్రీట్మెంట్ చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్స్కు గతేడాది జూన్లో పర్మిషన్ ఇచ్చింది. అప్పటి నుంచి మధ్య స్థాయి, చిన్న ప్రైవేట్ హాస్పిటళ్లు కరోనా రోగులకు ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. మొత్తంగా ప్రస్తుతం రాష్ర్టంలో 796 ప్రైవేట్ హాస్పిటళ్లు ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. ఇందులో 220 హాస్పిటళ్లు ఏడాది నుంచి పని చేస్తుండగా, మరో 570 హాస్పిటళ్లు ఈ మధ్యే కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాయి. ఈ మొత్తం హాస్పిటళ్లలో 29,007 బెడ్లు ఉండగా, ఇందులో కార్పొరేట్వి తీసేస్తే చిన్న హాస్పిటళ్లలోనే 23 వేల బెడ్ల వరకూ ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిల్లో 3,272 ఐసీయూ(వెంటిలేటర్) బెడ్లు, 4,516 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ హాస్పిటళ్ల వివరాలన్నీ https://covid19.telangana.gov.in/ వెబ్సైట్లో, ప్రభుత్వం ఇచ్చే హెల్త్ బులెటిన్లో అందుబాటులో ఉన్నాయి. మరో వారం, పది రోజుల్లో ఇంకో వెయ్యి హాస్పిటళ్లలో కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రెండు రోజుల క్రితమే ప్రకటించింది.
అదే ట్రీట్మెంట్.. చార్జీలు వేరే
కరోనా పేషెంట్లతో కార్పొరేట్ హాస్పిటళ్లు కిక్కిరిస్తున్నాయి. వాటిలోని ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లన్నీ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటళ్లన్నీ దాదాపుగా నిండిపోయాయి. ఇదే అదనుగా ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వాళ్లనే హాస్పిటళ్లు చేర్చుకుంటున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు పోలేక.. కార్పొరేటు ఆస్పత్రుల్లో లక్షలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి కరోనా పేషెంట్లకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎక్కడైనా ఒకేలా ఉంటోంది. సింప్టమ్స్, సీరియస్నెస్ను బట్టి పేషెంట్లను ఎలా ట్రీట్ చేయాలో ఢిల్లీ ఎయిమ్స్ గైడ్లైన్స్ రూపొందించింది. కార్పొరేట్ దవాఖానలైనా, చిన్న హాస్పిటల్స్ అయినా ఇవే గైడ్లైన్స్ను ఫాలో అవుతున్నాయి. కానీ రోగికి చార్జ్ చేస్తున్న బిల్లుల్లో మాత్రం చాలా తేడా ఉంటోంది. కార్పొరేట్లో రోజూ రూ.లక్ష నుంచి లక్షన్నర దాకా చార్జ్ చేస్తున్నారు. తమ దగ్గర అందుబాటులో ఉన్న ఎక్విప్మెంట్తో ఏయే టెస్టులు చేయొచ్చో అవన్నీ చేసి అడ్డగోలుగా బిల్లులు బాదుతున్నారు. నర్సింగ్ చార్జ్, డాక్టర్ ఫీజులు వేలల్లో వేస్తున్నారు. చిన్న హాస్పిటళ్లలో ఇలా వేర్వేరు పేర్లతో బిల్లులు వేయకుండా, రోజుకు ఇంత అని ఫిక్స్డ్గా ముందే చెప్పేస్తున్నారు. డాక్టర్, నర్సింగ్, ఆక్సిజన్, మెడిసిన్ అన్నీ అందులోనే కలిపి చెబుతున్నారు. వాస్తవానికి ఇవి కూడా ఎక్కువే అయినా.. కార్పొరేట్తో పోలిస్తే తక్కువే. కొన్ని హాస్పిటళ్లలో రోజూ రూ.25 వేల నుంచి 35 వేలు చార్జ్ చేస్తున్నారు. రోగులకు ఆయా హాస్పిటళ్ల సమాచారం అందుబాటులో లేకపోవడమే సమస్యగా మారుతోంది.
రోజూ రూ. 25 వేలు
కార్పొరేట్కు వెళ్లడానికి జనాలు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. అక్కడ దొరక్కపోవడంతో ఇప్పుడు చిన్న హాస్పిటళ్లకు వస్తున్నారు. మా దగ్గర ఈ మధ్యే కరోనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. రోజూ రూ.25 వేలు చార్జ్ చేస్తున్నాం. ఆక్సిజన్, రెమ్డెసివిర్ వంటి మెడిసిన్ ధరలు విపరీతంగా పెరగడం, స్టాఫ్ జీతాలు పెరగడం వంటి కారణాలతో చార్జీలు పెరిగాయి. ఆక్సిజన్, మెడిసిన్ రెగ్యులర్ సప్లై ఉండేలా చూస్తే చార్జీలు ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.- డాక్టర్ సుధీర్, లీల హాస్పిటల్, హైదరాబాద్
ఏడాదిగా ట్రీట్ చేస్తున్నం
ఏడాదిగా కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇప్పటిదాకా 450 మంది పేషెంట్లను ట్రీట్ చేశాం. ఒక్కరు మాత్రమే చనిపోయారు. మిగిలిన వాళ్లందరూ కోలుకుని ఇంటికెళ్లిపోయారు. 90 శాతం పేషెంట్లు నాలుగైదు రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతున్నారు. మొత్తం ట్రీట్మెంట్కు రూ.90 వేల నుంచి 1.3 లక్షల లోపు మాత్రమే చార్జ్ చేస్తున్నాం. రెమ్డెసివిర్ వంటి మెడిసిన్, ఆక్సిజన్కు ఎక్కువ ఖర్చు అవుతోంది.-పాలేటి కుమార్, రాజన్ హాస్పిటల్, కరీంనగర్
ఇది మంచి అవకాశం
చిన్న హాస్పిటళ్లకు ఆక్సిజన్, మెడిసిన్ సప్లై రెగ్యులర్గా ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్, మంత్రి ఈటలకు లెటర్ రాశాం. కరోనా పేషెంట్లు ఇప్పుడిప్పుడే చిన్న హాస్పిటళ్లకు వస్తున్నారు. డబ్బుల గురించి ఆలోచించకుండా, రీజనబుల్ చార్జీలతో ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్లకు సూచిస్తున్నాం. పేషెంట్ల నమ్మకాన్ని పొందగలిగితే వాళ్లు ఎప్పటికీ మర్చిపోరు. ఆ నమ్మకమే డాక్టర్లకు భవిష్యత్ను ఇస్తుంది.
- డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాద్
జనాలను భ్రమల్లోకి నెట్టేశారు
పెద్దపెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కు వెళ్తేనే రోగం నయం అవుతుందనే భ్రమల్లో జనాలు ఉన్నారు. తమ మార్కెటింగ్ టెక్నిక్ ద్వారా సక్సెస్ఫుల్గా ప్రజలను ఆ భ్రమల్లోకి నెట్టేయగలిగాయి. దీంతో చిన్నదానికి, పెద్ద దానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వైపు జనం పరుగెడుతున్నారు. పానిక్ అయి రూ.లక్షలు వృథా చేసుకుంటున్నారు. చిన్న హాస్పిటల్స్లో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు. తక్కువ చార్జీలకే ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
- డాక్టర్ విజయేందర్, హెల్త్ ఎక్స్పర్ట్.
ఎక్కడైనా ఎంబీబీఎస్ డాక్టర్లే..
కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా హంగులు, లగ్జరీ రూమ్లు తప్ప, అన్ని సేవలనూ చిన్న హాస్పిటళ్లు అందిస్తున్నాయి. పేషెంట్ కేర్, శానిటేషన్ విషయంలో కార్పొరేట్తో పోటీ పడుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్కు వెళ్లినా అక్కడ పేషెంట్లను డ్యూటీలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులే చూసుకుంటున్నారు. వందల సంఖ్యలో పేషెంట్లు ఉండడంతో, సీనియర్ డాక్టర్లు రోజుకు ఒకసారి కూడా పేషెంట్లను పరామర్శించడం లేదు. దాదాపు వీడియో కాల్ ద్వారానే పేషెంట్లను చూస్తున్నారు. చిన్న చిన్న హాస్పిటళ్లలో తక్కువ మంది పేషెంట్లు ఉండడం వల్ల కేర్ కూడా బాగుండే అవకాశం ఉంది. చాలా హాస్పిటళ్లలో 20 నుంచి 40 మంది కరోనా పేషెంట్లనే చేర్చుకుంటున్నాయి. నలుగురైదుగురు డాక్టర్లతో వీళ్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నాయి.