- పెరుగుతోన్న ఆర్థిక, ప్రాణ నష్టం
- స్తంభించిపోయిన వ్యాపారాలు
- దిగ్గజ కంపెనీల ప్రొడక్షన్స్ క్లోజ్
- గ్లో బల్ సప్లయి చైన్లో అంతరాయం
- విమానాలు రద్దు చేస్తోన్నఎయిర్ లైన్స్
- ప్రపంచదేశాలకు విస్తరిస్తోన్నకరోనా
వైరస్….మనుషుల ప్రాణాలు తీయగలదనే ఇప్పటివరకూ అనుకున్నాం. ‘అంతేనా….వైరసే కదాని లైట్ తీసుకుంటే ఊరుకోను’ అని వార్నింగ్ ఇవ్వాలనుకుందో ఏమో…ఒక్కసారి తొడగొట్టి…చైనా అంతటి పవర్ ఫుల్ దేశానికే తన పవరేందో చూపిస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బకి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నట్టే….చైనా ఎకానమీ గాలివానలో చిక్కిన నావలా షేకయిపోతోంది. చైనా ఫ్యాక్టరీల్లో పనులు ఆగిపోయాయి. దీనితో మనమంతా ఎగబడి కొనుక్కునే చైనా ఫోన్లు, చైనా బొమ్మలూ, చైనా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లూ తయారుకావట్లే. ఆటో ఇండస్ట్రీకి కూడా బ్రేక్ పడిపోయింది. అక్కడినుంచి ఎగుమతులూ ఆగిపోయినయ్. ఇదంతా చైనా ఎకానమీని భరించలేనంత దెబ్బతీసింది. అక్కడితో ఆగట్లే. చైనా దెబ్బకు ప్రపంచంలో మిగతా మార్కెట్లకు కూడా వణుకు మొదలైంది. ఆ ఎఫెక్టు రానురాను పెరుగుతదే తప్ప తగ్గే చాన్సు ఇప్పట్లో కనబడట్లే.
వెలుగు, బిజినెస్డెస్క్: చైనాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇన్ని రోజులు అమెరికాతో ట్రేడ్ వార్.. హమ్మయ్య దాని నుంచి ఎలాగోలా గట్టెక్కాం అనుకోగానే.. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన వైరస్ కరోనా.. ఈ వైరస్ కారణంగా చైనా విలవిలలాడుతోంది. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు. మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఈ వైరస్.. ప్రపంచదేశాలకు కూడా వ్యాపిస్తోంది. దీంతో చైనాలోకి ఎవర్ని రానీవడం లేదు. చైనాకు ఎవరూ పోవడం లేదు. ఇప్పటికే చాలా దేశాలు చైనాకు ఫ్లయిట్స్ నడపడం ఆపివేశాయి. అంతేకాక చైనాతో ముడిపడిన వ్యాపారాలు కూడా స్తంభించిపోతున్నాయి. యాపిల్, స్టార్బక్స్, ఐకియా లాంటి పెద్ద పెద్ద సంస్థలే చైనాలో తమ స్టోర్లను తాత్కాలికంగా మూసివేశాయి. షాపింగ్ మాల్స్ తెరుచుకోవడం లేదు. కార్లు తయారు చేసే కంపెనీలు జనరల్ మోటార్స్, టయోటో లాంటి సంస్థలు కూడా ప్రొడక్షన్ను ఆపి వేశాయి. అమెరికన్, డెల్టా, యునైటెడ్, లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సంస్థలు చైనాకు విమానాలు రద్దు చేశాయి. ఈ వైరస్ ఎఫెక్ట్తో చైనా లో ఎందరో రాలిపోతున్నారు. ఇటు ఆర్థికంగా కూడా ఆ దేశం తీవ్రంగా దెబ్బతింటోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల చైనాలో 400 మంది చనిపోయారు. మరో 20,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ ఇప్పటికే 23 దేశాలకు విస్తరించింది.
ప్రపంచ ఎకనమిక్ గ్రోత్లో అమెరికా, యూరప్, జపాన్లను మించి అతిపెద్ద షేరు చైనాదే. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్తో చైనా ఎకనమిక్ గ్రోత్ ఈ ఏడాది 5.6 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ఆక్స్ఫోర్డ్ ఎకనమిక్స్ అంచనావేసింది. ఈ గ్రోత్ లాస్ట్ ఇయర్ 6.1 శాతంగా ఉంది. చైనా గ్రోత్ దెబ్బతింటుండటంతో, గ్లోబల్ ఎకనమిక్ గ్రోత్ కూడా 0.2 శాతం పడిపోయి 2.3 శాతంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2002లో సార్స్ వైరస్ ఎఫెక్ట్ కూడా ఇదే మాదిరి చైనాను కుంగదీసింది. సార్స్కు మించిపోయి.. కరోనా చైనాను ఆర్థికంగా పడేస్తోందని ఆర్థిక వేత్తలంటున్నారు. కరోనా నుంచి చైనా ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అక్కడ లీడర్స్ ఎకానమీలోకి కొత్తగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చేలా చేస్తామని ప్రకటించారు. అయినా కూడా చైనా స్టాక్ మార్కెట్లు కోలుకోలేకపోతున్నాయి.
కరోనా బయటపడినప్పటి నుంచి షాంఘై స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే సాగుతోన్న సంగతి తెలిసిందే. చైనా గ్లోబల్గా రెండవ అతి పెద్ద ఆర్థికవ్యవస్థ కావడంతో దీని ప్రభావం ఇతర దేశాలపై కూడా పడుతోంది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటో పార్ట్లకు చైనా పెట్టింది పేరు. క్లోతింగ్, ప్లాస్టిక్ గూడ్స్ వంటి తక్కువ విలువున్న వస్తువులకు కూడా చైనాలో ఎక్కువగా తయారవుతాయి. వీటిని ఇతర దేశాలకు చైనా సప్లయి చేస్తుంటోంది. మెక్సికో నుంచి మలేషియా వరకు చైనా ఎక్స్పోర్ట్స్ సాగిస్తోంది. ఇప్పుడు వీటిపై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ట్రేడ్ వార్ ఎఫెక్ట్తోనే.. మల్టినేషనల్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను చైనా నుంచి ఇతర దేశాలకు మార్చుకున్నాయి. ఇక కరోనా ఎఫెక్ట్తో మిగిలిన కంపెనీలు కూడా చైనా నుంచి బయటపడేందుకు చూస్తున్నాయి. లునార్ న్యూఇయర్తో చాలా ఫ్యాక్టరీలకు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో, ఈ హాలిడేస్ను ప్రభుత్వం పొడిగించింది. మేజర్ ఇండస్ట్రియల్ ప్రాంతాలు షాంఘై, సుజౌ, గ్వాంగ్డాంగ్లు మరో వారం పాటు హాలిడేస్ను పొడిగించాయి. గోల్డ్మాన్ శాక్స్, జేపీ మోర్గాన్లు కూడా మరో రెండు వారాలు చైనా ఉద్యోగులను సెలవులు తీసుకోమని చెప్పాయి. అమెరికాలో కంటే చైనాలో ఎక్కువ కార్లను అమ్మే జనరల్ మోటార్స్.. మరో వారం చైనీస్ ఫ్యాక్టరీలను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫోర్డ్ మోటార్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని మేనేజర్లకు చెప్పింది. చైనా నుంచి ఇతర దేశాలకు కూడా ఇంపోర్ట్ ఆర్డర్లు రావడం లేదు. కంప్యూటర్ చిప్స్ను తైవాన్, దక్షిణ కొరియా, కాపర్ను కెనడా, ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్ను జర్మనీ, ఇటలీ నుంచి చైనా దిగుమతి చేసుకుంటోంది.
హ్యుండయ్ ప్రొడక్షన్ ఆపివేత…
కరోనా వైరస్ ఎఫెక్ట్తో హ్యుండయ్ స్వదేశం దక్షిణ కొరియాలో ప్రొడక్షన్ ఆపివేసింది. ఈ ప్లాంట్లలో తయారయ్యే బండ్లకు చైనా నుంచే ఆటో పార్ట్స్ రావాలి. అయితే వైరస్ కారణంగా ఆటో పార్ట్స్ రావడం లేదు.ప్రొడక్షన్కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో కొరియాలోని తన ప్లాంట్స్ అన్నింటిలో హ్యుండయ్ ప్రొడక్షన్ను ఈ వారం ఆపివేస్తున్నట్టు ప్రకటించింది. జపాన్ ఫుకోషిమా భూకంపం వచ్చినప్పటి కంటే ఎక్కువగా గ్లోబల్ కారు ఇండస్ట్రీ సప్లయి చైన్లో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
షాంఘై ఇండెక్స్లకు ఐదేళ్లలో అతిపెద్ద నష్టం….
వైరస్ దెబ్బతో సోమవారం సెషన్లో చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్(డౌన్ 7 శాతం) ఐదేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చూసింది. షార్ట్కవరింగ్ వల్ల మంగళవారం సెషన్లో మాత్రం 1.3 శాతం లాభపడింది. ఇతర ఆసియా దేశాల మార్కెట్లు కరోనాతో వణికిపోతున్నాయి. మన మార్కెట్పై కరోనా ప్రభావం రెండు రోజులకే పరిమితమైంది.
చైనా కంపెనీలకు, ఇండియన్ ప్రతినిధులు…
ఈ నెల 7 నుంచి మన దేశంలో ఆటో ఎక్స్పో ప్రారంభం కాబోతుంది. ఈ ఎక్స్పోకు చైనీస్ కంపెనీలు కూడా వస్తున్నాయి. అయితే ఈ కంపెనీలకు ఇండియన్ ఉద్యోగులు ప్రతినిధులుగా వ్యవహరించనున్నారని ఇండస్ట్రీ బాడీ సియామ్ చెప్పింది. చైనా నుంచే వచ్చేవారందరినీ ఆపివేశామని, చైనా నుంచి విజిటర్స్, డెలిగేషన్స్ ఎవరూ రావడం లేదని పేర్కొంది. చైనా ట్రావెలర్స్కు ఇండియా తాత్కాలింగా ఈ–వీసా ఫెసిలిటీని ఆపివేసింది. చైనాలోని పెద్ద పెద్ద ఆటో కంపెనీలు ఈ ఎక్స్పోకు వస్తున్నాయి. ఇండియన్ ఆటో మార్కెట్లో మెజార్టీ వాటా దక్కించుకోవాలని చూస్తోన్న చైనీస్ కంపెనీలు గ్రేట్ వాల్ మోటార్,ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్, ఎలక్ట్రిక్ బస్, మేటరీ మేకర్ బీవైడీలు ఈ ఎక్స్పోలో 20 శాతం స్పేస్ను పొందాయి. అయితే కరోనా ఎఫెక్ట్తో డైరెక్ట్గా చైనా ప్రతినిధులు కాకుండా… ఇండియన్ ఉద్యోగులే వీరి ప్రతినిధులుగా
ఉండబోతున్నారు.
ఢిల్లీ-హాంకాంగ్ విమానాలు బంద్..
ఈ నెల 8 నుంచి ఢిల్లీ–హాంకాంగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల ఏడున ఏఐ314 విమానం తర్వాత, ఏ విమానం కూడా హాంకాంగ్కు వెళ్లవని ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని లోహాని చెప్పారు. ఇప్పటికే ఇండియా, చైనా మధ్య తిప్పుతున్న తన మూడు విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఎయిరిండియా కూడా ఢిల్లీ–షాంఘై విమాన సర్వీసులను ఆపివేసింది. ఇప్పుడు ఢిల్లీ–హాంకాంగ్లకు కూడా ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులుండవని చెప్పింది.
సింగపూర్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్…
కరోనా ఎఫెక్ట్తో వచ్చే వారం సింగపూర్లో జరుగబోయే ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ రద్దయింది. ఈ ఎయిర్షో ఈ నెల 11 నుంచి 16 వరకు జరపాలని ఆర్గనైజర్లు అనుకున్నారు. దీనిలో పాల్గొనే వారు ఎక్కువ మంది చైనా వారే ఉన్నారు. అమెరికా ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్, యూరోపియన్ ఎయిర్బస్ ఈ ఎయిర్షోకు బిగ్గెస్ట్ ప్లేయర్లు. సార్స్ వైరస్ వల్లనే అప్పట్లో ఆసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ 6 బిలియన్ డాలర్ల వరకు రెవెన్యూలు కోల్పోయాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) చెప్పింది. ఇదే మొత్తంలో ప్రస్తుతం కూడా కోల్పోతామని పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాపై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.