న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీలు ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్(క్యూ4)కు సంబంధించి రిజల్ట్స్ను ప్రకటించడం మొదలుపెట్టాయి. ఐటీ కంపెనీ విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్సబ్సిడరీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, మైనింగ్ కంపెనీ హిందుస్తాన్ జింక్ శుక్రవారం తమ ఫలితాలను వెల్లడించాయి.
8 శాతం తగ్గిన విప్రో ప్రాఫిట్
విప్రో ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్(క్యూ4) లో రూ 2,835 కోట్ల నికర లాభం సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో వచ్చిన రూ. 3,074.5 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. కంపెనీ రెవెన్యూ రూ. 23,190.3 కోట్ల నుంచి 4.2 శాతం తగ్గి రూ.22.208.3 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో విప్రోకు రూ. 2,694 కోట్ల నికర లాభం, రూ. 22,205 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఈ ఐటీ కంపెనీకి మార్చి క్వార్టర్లో రూ.2,748 కోట్ల నికర లాభం, రూ. 22,117 కోట్ల రెవెన్యూ వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఐటీ సర్వీసెస్ సెగ్మెంట్ నుంచి 2,657.4 మిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రెవెన్యూ 1.5 శాతం తగ్గొచ్చని, పరిస్థితులు బాగుంటే రెవెన్యూ గ్రోత్ 0.5 శాతం ఉంటుందని గైడెన్స్ ప్రకటించింది. విప్రో షేర్లు శుక్రవారం 1.74 శాతం పెరిగి రూ.452.1 దగ్గర క్లోజయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఇండస్ట్రీ చాలా సమస్యలను ఎదుర్కొందని, ఆర్థిక పరిస్థితులు నిలకడగా లేవని విప్రో కొత్త సీఈఓ, ఎండీ శ్రీనివాస్ పల్లియ అన్నారు. భవిష్యత్పై సానుకూలంగా ఉన్నామని చెప్పారు.
కంపెనీలో టెక్నాలజీ మార్పులు తీసుకొస్తున్నామని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తమ క్లయింట్ల అవసరాలను తీరుస్తోందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీపై ఎక్కువ ఫోకస్ పెడతామని అన్నారు. కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియ నేతృత్వంలో విప్రో రిజల్ట్స్ను ప్రకటించడం ఇదే మొదటిసారి. మాజీ సీఈఓ థియరీ డెలపోర్టే ఈ నెల 6 న తన పదవి నుంచి తప్పుకున్నారు. విప్రో ప్రమోటర్లు ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉండడంతోనే టెన్యూర్ పూర్తికాకుండానే డెలపోర్టే సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారని రిపోర్ట్స్ వెలువడ్డాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో తమ మార్జిన్స్ 40 బేసిస్ పాయింట్లు పెరిగాయని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అపర్ణ అయ్యర్ అన్నారు. సమస్యలు ఉన్నప్పటికీ తమ ఐటీ సర్వీసెస్ సెగ్మెంట్లో మార్జిన్స్ 50 బేసిస్ పాయింట్లు పెరిగాయని తెలిపారు. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత క్యాష్ ఫ్లోను జనరేట్ చేశామన్నారు.
ఆరో క్వార్టర్లోనూ డౌన్
వేదాంత గ్రూప్ సబ్సిడరీ కంపెనీ హిందుస్తాన్ జింక్ నికర లాభం వరుసగా ఆరో క్వార్టర్లోనూ తగ్గింది. చైనాలో డిమాండ్ తగ్గడంతో మన దగ్గర జింక్ ధరలు పడుతున్నాయి. ఫలితంగా కంపెనీ నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 21 శాతం పడి (ఏడాది ప్రాతిపదికన) రూ.2,038 కోట్లుగా రికార్డయ్యింది. హిందుస్తాన్ జింక్ ప్రొడక్షన్ క్యూ4 లో 2 శాతం, సేల్స్ 17 శాతం తగ్గాయి. కిందటేడాది మార్చి క్వార్టర్తో పోలిస్తే కంపెనీ రెవెన్యూ ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 12 శాతం తగ్గి రూ.7,285 కోట్లుగా రికార్డయ్యింది. హిందుస్తాన్ జింక్ షేర్లు శుక్రవారం 1.72 శాతం పడి రూ.398 దగ్గర సెటిలయ్యాయి.
జియో ఫైనాన్స్ లాభం రూ.310 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నికర లాభం కిందటేడాది మార్చి క్వార్టర్లో వచ్చిన రూ. 1,604.5 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది మార్చి క్వార్టర్లో ఏకంగా 80 శాతం పడింది. రూ. 310.6 కోట్లుగా రికార్డయ్యింది. రెవెన్యూ రూ.1,858.8 కోట్ల నుంచి 77 శాతం తగ్గి రూ.418.1 కోట్లకు పడింది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన ఏకంగా 70 శాతం తగ్గింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ.937.7 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ప్రకటించిన కంపెనీ, ఈ ఏడాది మార్చి క్వార్టర్లో రూ. 280.7 కోట్లు మాత్రమే సాధించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు శుక్రవారం 2.22 శాతం నష్టంతో రూ.370 దగ్గర సెటిలయ్యాయి. గతంలో రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్గా కొనసాగిన ఈ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయ్యి కిందటేడాది ఆగస్టులో మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది. ప్రస్తుతం లిస్టింగ్ ధర రూ.265 పైన ట్రేడవుతోంది.