
జయశంకర్ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు : సర్కారు బడుల్లోనూ కార్పొరేట్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారంలో రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ కాలేజీని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం సీసీరోడ్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే విద్యారంగానికి పెద్దపీట వేశామన్నారు. పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి మౌలిక సౌలత్లు కల్పించామని చెప్పారు.
పదేండ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లను కాంగ్రెస్ గెలిచాకే క్లియర్ చేశామని గుర్తు చేశారు. టెన్త్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ల్యాబ్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాపు, కాటారం సబ్కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీఈవో రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సమ్మయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.