మన దేశ తొలి కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ను ఎయిమ్స్ లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఈ ట్రయల్స్ లో 18సంవత్సరాల నుంచి 55 ఏళ్ల లోపు వయసు ఉన్న వారిపై ప్రయోగించనున్నారు.
కాగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. భారత్ బయోటెక్కు చెందిన బయో సేఫ్టీ లెవల్ 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు. కోవాగ్జిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) అనుమతిచ్చింది.