- వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త సబ్ వేరియంట్ ‘ఎన్బీ.1.8.1’
సింగపూర్: సింగపూర్లో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత వారంలోనే కొత్తగా 12,700 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏజెన్సీ (సీడీఏ) తెలిపింది. మే 10 నుంచి 16 మధ్య కాలంలో ఈ కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఏకంగా 4,700 కేసులు అదనంగా పెరిగాయి. ఈ మేరకు సీడీఏ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొవిడ్ కేసులతో పాటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగిందని తెలిపింది. సగటున రోజువారీ కొవిడ్ హాస్పిటలైజేషన్లు 56 నుంచి 73కి చేరాయని పేర్కొంది. ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, రోజుకు సగటున ఒక రోగి మాత్రమే చేరుతున్నారని వెల్లడించింది. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని సీడీఏ వివరించింది. కొవిడ్- ప్రస్తుతం సాధారణ శ్వాసకోశ వ్యాధిగా మారిందని, ఇలాంటి ఇన్ఫెక్షన్లు అప్పుడప్పుడు రావడం సహజమేనని పేర్కొంది. ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లే ఈ కేసులు పెరిగి ఉండవచ్చని అంచనా వేసింది.
సగానికిపైగా కొత్త వేరియెంట్ కేసులే
ప్రస్తుతం సింగపూర్లో ‘ఎన్బీ.1.8.1’ అనే కొత్త సబ్- వేరియంట్ అత్యధికంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ స్థానికంగా సేకరించిన నమూనాలలో సగానికి పైగా ఈ వేరియంట్ కేసులే ఉన్నాయి. అయితే, ఇది మునుపటి వైరస్ల కంటే ప్రమాదకరమేమీ కాదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని డాక్టర్లు స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, కేర్ హోమ్లలో ఉండేవారు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ బూస్టర్ డోస్ వ్యాక్సిన్లను సకాలంలో వేయించుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
సాధారణ ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటంతో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.
