
భద్రాచలం, వెలుగు: ఏపీలో కలిసిన పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకలపాడు ఐదు పంచాయతీలను తక్షణమే తెలంగాణలో విలీనం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. భద్రాచలంలో మంగళవారం ఆయన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
పార్లమెంట్లో హిందీ భాష పేరుతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డిని అవమానపరిచిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ప్రకారం పార్లమెంట్లో 22 భాషల్లో మాట్లాడవచ్చని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు మాట్లాడుతుంటే స్పీకర్ తిరస్కరణ ధోరణి చూపడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎన్నికల కమిటీలు వేసి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరి గెలుపైనా, ఓటమైనా సీపీఐయే నిర్ణయిస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, బొల్లోజు అయోధ్య, రావులపల్లి రవికుమార్, నరాటి ప్రసాద్, ఆకోజు సునీల్, కల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు
పాల్గొన్నారు.