- ఎవరైనా కరోనాపై భయభ్రాంతులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు
- కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప
కర్నూలు: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. డీపీవోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోకి కరోనా ప్రమాదకర వేరియంట్ N440K ప్రవేశించిందని.. సీసీఎంబీ కూడా నిర్ధారించినట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది చేసిన ఫిర్యాదు ను పరిశీలించి సీఆర్పీసీ నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. రేపు ఆదివారం హైదరాబాద్ లో చంద్రబాబుకు సిఆర్ పిసి నోటిసు ఇవ్వడానికి దర్యాప్తు అధికారిగా కర్నూలు ఒకటవ పట్టణ సిఐ హైదరాబాదు కు వెళుతున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప వెల్లడించారు.కరోనా N440K వేరియంట్ ప్రమాదకరమని విమర్శించడం.. భయభ్రాంతులకు గురిచేయడం రెండూ వేరు వేరని.. సీసీఎంబీ కూడా అంత పెద్ద ప్రమాదకరం కాదని నిర్ధారించిందని ఆయన చెప్పారు. ఎవరైనా కరోనాకు సంబంధించి సోషల్ మిడియాలో వదంతులు, అసత్యప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.