నీటిమీద తేలియాడే స్వర్గం ఏదైనా ఉందంటే… అది క్రూయిజ్ షిప్ అనే చెప్పాలి. అందులో లేని సదుపాయమంటూ ఉండదు. వారం రోజులు, 15 రోజుల చొప్పున ట్రిప్స్ వేస్తూ, సముద్రం అందాలతో మైమరిపిస్తుంది. సన్ రైజ్ని, సన్ సెట్ని డెక్ మీద నుంచే ఎంజాయ్ చేసేలా డిజైన్ చేసి, టూరిస్టులను ఆకట్టుకుంటారు షిప్ ఓనర్లు. చిటికేస్తే క్షణాల్లో కాంటినెంటల్ ఫుడ్ వేడి వేడిగా టేబుల్ మీదకొచ్చేస్తుంది. ముట్టుకుంటే మాసిపోయే తెలుపుతో క్రూయిజ్ కంపార్టుమెంట్లలో బెడ్లు మెరుస్తుంటాయి. ఇక, ఇంటీరియర్ డిజైన్ గురించి చెప్పనక్కర లేదు. స్విమ్మింగ్ పూల్స్, బిలియర్డ్ టేబుల్స్, రెస్టారెంట్స్, షాపింగ్, థియేటర్లు, డ్యాన్సింగ్, మ్యూజిక్… ఇవన్నీ ఉంటాయి క్రూయిజ్ షిప్పుల్లో.
అలాంటి కదిలే స్వర్గంలో ప్రయాణిస్తున్నవాళ్లకు చెప్పలేనన్ని కష్టాలొచ్చాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కొవిడ్–19) వైరస్ ప్రయాణీకులకు సోకిందన్న అనుమానంతో మూడు ఖరీదైన క్రూయిజ్లను వేర్వేరు దేశాల్లో నిలిపేశారు. జపాన్లో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ని, హాంకాంగ్లో వరల్డ్ డ్రీమ్ క్రూయిజ్ని, కంబోడియాలో వెస్టర్డామ్ క్రూయిజ్ని నిలిపేశారు. అక్కడి పోర్టుల్లో లంగరు వేసి, పాసింజర్లకు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటి వరకు జెమ్ క్లాస్ షిప్ కేటగిరీకి చెందిన డైమండ్ ప్రిన్సెస్లో 542 మందికి, వరల్డ్ డ్రీమ్లో ముగ్గురికి కొవిడ్–19 వైరస్ సోకినట్లుగా ఖాయం చేశారు. వెస్టర్డామ్ క్రూయిజ్లో ఎవరికీ పాజిటివ్ రిజల్ట్ రాలేదు. జనవరి రెండో వారంలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ ప్రయాణీకులు, సిబ్బంది కలిసి మొత్తం 3,750 మందితో బయలుదేరిన తర్వాత కరోనా వైరస్ వార్తలు వెలువడ్డాయి. క్రూయిజ్ ప్రయాణిస్తున్న మార్గంలోని ఏదైనా దేశంలో వైరస్ లేదా అంటువ్యాధులు సోకుతున్నప్పుడుగానీ, వాళ్ల టూర్ సాగాల్సిన ఏదైనా దేశంలో అంటువ్యాధులు వచ్చినప్పుడుగానీ పాసింజర్ షిప్లను తనిఖీ చేస్తారు. అదే పద్ధతిలో డైమండ్ ప్రిన్సెస్లో చెక్ చేసినప్పుడు 80 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ని గుర్తించారు. జనవరి 20న హాంకాంగ్కి చెందిన ఈ వ్యక్తి యొకోహామా (జపాన్) రేవులో క్రూయిజ్ ఎక్కారు. ఆయనను అయిదు రోజుల తర్వాత టెస్టుల్లో పాజిటివ్గా తేలడంతో హాంకాంగ్లో దింపేశారు. ఫిబ్రవరి నాలుగు నాటికి జపాన్ జలాల్లోకి వచ్చినప్పుడు మరోసారి టెస్ట్లు చేయగా, రోజురోజుకూ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో యొకోహామా పోర్టులోనే క్రూయిజ్ని ఆపేశారు. ఇప్పటివరకు 524 మందికి కొవిడ్–19 సోకినట్లుగా గుర్తించారు. ఈ క్రూయిజ్లో ఉన్న వివిధ దేశాల పాసింజర్లను ఆయా దేశాల ఎంబసీలు ప్రత్యేక ఏర్పాట్లతో వెనక్కి తీసుకెళ్లిపోయాయి. అమెరికా 300కి పైగా తమ దేశస్తుల్ని స్వదేశానికి తరలించింది. కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్కూడా తమవాళ్లను తీసుకెళ్లిపోయాయి. బ్రిటన్ దేశీయులు డేవిడ్ ఏబెల్, అతని భార్య ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్టు చేస్తున్నారు. ‘మా దేశం వాళ్లు పట్టించుకోవట్లేదు. నేను షుగర్ పేషెంట్ని. నాకు వేళకు సరైన తిండి పెట్టేవాళ్లుగానీ, మందులిచ్చేవాళ్లుగానీ లేరు. జైలులో ఉన్నట్లుంది’ అని తమ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
వెస్టర్డామ్కి అయిదు దేశాలు ‘నో’
మూడో క్రూయిజ్ వెస్టర్డామ్లో ఎవరికీ కొవిడ్–19 వైరస్ లేదని పరీక్షల్లో తేలింది. ఈ క్రూయిజ్లో సిబ్బంది పాసింజర్లు మొత్తం 2,000 వరకు ఉన్నారు. వైరస్ భయంతో అయిదు దేశాలు క్రూయిజ్ని రానివ్వలేదు. జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్, థాయిలాండ్, అమెరికా భూభాగానికి చెందిన గువామ్ ఐలాండ్ ఈ క్రూయిజ్ ఆగడానికి ఒప్పుకోలేదు. హాలండ్ అమెరికన్ లైన్వాళ్లు వెస్టర్డామ్ని నడుపుతున్నారు. చివరికి కంబోడియా అంగీకరించడంతో సిహనౌక్విల్లే రేవులో లంగరు వేశారు. అక్కడ టెస్టులు పూర్తయ్యాక నామ్ఫెన్కి చార్టర్ ఫ్లయిట్లద్వారా పాసింజర్లను తరలించారు. సొంత ఖర్చులపై క్రూయిజ్ ఆపరేటర్లు వాళ్లను స్వదేశాలకు తరలిస్తామని ప్రకటించారు.
కొవిడ్ 19 వైరస్ దెబ్బకు డైమండ్ ప్రిన్సెస్, వరల్డ్ డ్రీమ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ రెండు క్రూయిజ్ల నుంచి పాజిటివ్గా గుర్తించినవాళ్లెవరినీ బయటకు వదలడం లేదు. ఈ క్రూయిజ్లు వాటంతట అవే ‘క్వారంటైన్’లుగా మారిపోయాయి. నౌక నుంచి బయటికి అడుగుపెడితే మిగతా వారికి వైరస్ సోకుతుందన్న భయంతో క్రూయిజ్లను ఇలా నిలిపివేస్తుంటారు. మొత్తమ్మీద కొవిడ్–19 వైరస్ క్రూయిజ్ ఆపరేటర్లకు చుక్కలు చూపించిందనే చెప్పాలి.