ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేపు సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు భేటీ జరగనుంది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో మీటింగ్ నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాభవం, కొత్త అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్న దృష్ట్యా సెప్టెంబర్లో నిర్వహించాల్సిన అంతర్గత ఎన్నికలను అంతకన్నా ముందే నిర్వహించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Congress Working Committee (CWC) meeting to be held tomorrow at 4PM at AICC office in Delhi, to discuss poll debacle in 5 states and current political situation pic.twitter.com/wWg3rRwu4f
— ANI (@ANI) March 12, 2022
తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కనీసం గోవా అయినా తమకు దక్కుతుందని గంపెడాశ పెట్టుకున్న పార్టీకి నిరాశే ఎదురైంది. పంజాబ్లో అధికారం కోల్పోవడంతో పాటు ప్రియాంక అన్నీ తానై ప్రచారం నిర్వహించిన యూపీలోనూ ఘోర పరాభవాన్ని మూటగట్టుుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అసమ్మతి నేతలు (జీ 23 నేతలు) ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమికి బాధ్యులెవరో తక్షణమే తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం జరగనున్న భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.