- వేల కోట్ల దోపిడీ దందా
- విదేశాల నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్
- క్రిప్టో కరెన్సీగా మార్చి ఫారిన్కు తరలింపు
- రెండేండ్లలో 10,258 బ్యాంక్ అకౌంట్స్ గుర్తించిన పోలీసులు
- హోల్డర్స్ తప్ప చిక్కని సైబర్ క్రిమినల్స్
- ఇన్వెస్టిగేషన్స్కు బ్రేక్, రికవరీ నిల్
‘‘ కొద్దిరోజుల కిందట స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.3.16 కోట్లు మహారాష్ట్రకు చెందిన జుడిత్ గొన్ సల్వేస్, సనా మహ్మద్ ఖురేషి అనే మహిళల అకౌంట్స్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓ సైబర్ చీటింగ్ కేసులో ఆ అకౌంట్స్ ఆధారంగా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు.
అకౌంట్స్ కలిగిన ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించగా.. వాటిని అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. నిందితుడు నాగపూర్కు చెందిన సీఏ రోనక్ తన్నాను కూడా అరెస్ట్ చేశారు. ఇలాంటివే మరో 95 బ్యాంక్ అకౌంట్స్ దొరికాయి. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా 83 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.’’
‘‘ వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్టైమ్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో 109 బ్యాంక్ అకౌంట్స్లో 15వేల మంది బాధితుల నుంచి రూ రూ. 712 కోట్లు డిపాజిట్ అయ్యాయి. గతేడాది జూలైలో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఆరిఫ్, అనాస్, ఖాన్బాయ్, పీయూష్ అకౌంట్స్గా పోలీసులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా వాటిని రెంట్కు ఇచ్చినట్టు...అందులో డిపాజిట్ చేసిన డబ్బులోనూ కమీషన్లు ఇస్తున్నట్లు అకౌంట్ కలిగిన వారు తెలిపారు.’’
హైదరాబాద్,వెలుగు: ఆర్థిక నేరాల్లో సైబర్ నేరగాళ్లు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నంబర్లకు ఒక నెట్వర్క్నే క్రియేట్ చేసుకున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి బ్యాంక్ అకౌంట్స్ కొనుగోలు చేస్తున్నారు. అకౌంట్స్లో డిపాజిట్ అయ్యే డబ్బుకు కమీషన్లు కూడా ఇస్తున్నారు. ఇండియాకు చెందిన బ్యాంక్ అకౌంట్స్, ఫోన్లను దుబాయి, చైనా, హాంకాంగ్ సహా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఏజెంట్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. సైబర్ నేరాలు,ఇన్వెస్ట్ మెంట్ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమింగ్,సైబర్ అటాక్స్ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బును నకిలీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు.
స్కీమ్స్ పేరిట బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్
ముంబయి, ఢిల్లీ, కోల్కతా, యూపీ, తమిళనాడు, హైదరాబాద్ ఇలా.. దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లను రెంటుకు తీసుకుంటున్నారు. చదువురాని వారు, ఫుట్పాత్ వ్యాపారులు, బస్తీ వాసులను స్థానిక ఏజెంట్లతో ట్రాప్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు అని చెప్పి అడ్రస్ ప్రూఫ్స్ తీసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ చేస్తున్నారు. ఇలా అకౌంట్స్ ఇచ్చిన వారి స్తోమతను బట్టి రూ.50 వేల నుంచి రూ.2లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కు నెట్బ్యాంకింగ్ సహా ఇతర పేమెంట్ గేట్వేస్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి అకౌంట్స్ను సైబర్ నేరగాళ్లు ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
విదేశాల నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్
బ్యాంక్ అకౌంట్స్తో లింకైన ఫోన్ నంబర్లు దుబాయి, చైనాలోని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, కోల్కతాలోని చిరు వ్యాపారుల గూగుల్పే, పేటీఎం లాంటి గేట్వేస్ను వాడుతున్నారు. అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవారికి 5 శాతం కమీషన్ ఇస్తున్నారు. డబ్బును ఈ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టో కరెన్సీగా మార్చుతున్నారు. మనీలాండరింగ్, హవాలా రూపంలో సొంత దేశాలకు తరలిస్తున్నారు. ఇలాంటి నైజీరియన్స్, చైనీస్ ఫ్రాడ్ కేసుల్లో క్యాష్ రికవరీ చేయడమనేది పోలీసులకు సవాలుగా మారుతుంది. సైబర్ నేరాల్లో పోలీసులు బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నంబర్లు లభించినా అసలైన సైబర్ నేరగాళ్ల జాడ దొరకడం లేదు.
అకౌంట్ హోల్డర్సే పట్టుబడుతుండగా..
అకౌంట్ ఓపెన్ చేసిన అడ్రస్కు వెళ్తే అక్కడ నిరక్షరాస్యులు మాత్రమే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. తమకు సొంత బ్యాంక్ అకౌంట్ ఉందనేది కూడా చాలా మంది బాధితులకు తెలియదు. దీంతో సైబర్ మోసాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లభించినా క్యాష్ రికవరీ సాధ్యం కావడం లేదు. దీంతో ఒక్కో కేసును ఛేదించేందుకు పోలీసులు నెలల తరబడి టైం పడుతుంది. ఇలాంటి కేసుల్లో అకౌంట్స్ అద్దెకు ఇచ్చినవాళ్లు, అమాయకులు తప్ప సైబర్ నేరగాళ్లు మాత్రం చిక్కడం లేదు. దీంతో అకౌంట్ హోల్డర్లకు నోటీసులు ఇచ్చి పోలీసులు వెనుదిరిగి వస్తుండడమే కాకుండా ఆపై కేసుల్లో ఇన్వెస్టిగేషన్కు బ్రేక్ పడుతుంది.