
భోపాల్: పాకిస్థాన్కు ప్రధాని మోడీ మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దాయాది పాక్ మళ్లీ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే.. ఇకపై మాటల్లేవ్ బుల్లెట్లతోనే సమాధానం ఉంటుందని ఘాటు హెచ్చరికలు పంపారు. శనివారం (మే 31) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని పురస్కరించుకుని భోపాల్లో నిర్వహించిన మహిళా సశక్తీకరణ్ మహా సమ్మేళన్లో పాల్గొన్నారు.
ALSO READ | ఆపరేషన్ సిందూర్లో.. రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్లు కుప్పకూలినయ్ : మంత్రి ఉత్తమ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ద్వారా హిందూ వైవాహిక సాంప్రదాయానికి చిహ్నమైన సింధూరం నేడు నారీ శక్తి, జాతీయ శౌర్యానికి చిహ్నంగా మారిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ సిందూర్ భారత్ ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ అని పేర్కొన్నారు. టెర్రరిజానికి ఇక భూమిపై స్థానం లేదని ఆపరేషన్ సిందూర్ స్పష్టమైన సందేశాన్ని పంపిందన్నారు. ఇకపై పాకిస్తాన్ ఏమైనా దాడులు చేస్తే.. దానికి బుల్లెట్లతోనే సమాధానం ఉంటుందని కరాఖండింగా చెప్పారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, దేశ ప్రజలను కాపాడుకోవడంలో అచంచలమైన నిబద్ధతను ఆపరేషన్ సిందూర్ ప్రదర్శించిందని పేర్కొన్నారు.
ఇక.. రాణి అహల్యాబాయి చెప్పినట్లుగా ఒక నాయకుడు ప్రజల జీవితాల్లో సంస్కరణలను తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అహల్యాబాయి ఎప్పుడూ పేద, పెద్ద అనే తేడా చూడలేదని.. పేదలకు సహాయం చేసి వారి జీవితంలో పురోగతి సాధించడానికి ఆమె తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. అహల్యాబాయి హస్తకళల రంగంలో మహిళలకు సాధికారత కల్పించారని, నీటి సంరక్షణ కోసం కృషి చేశారని పొగిడారు.
అహల్యాబాయి అభివృద్ధి పనులకు పునాది వేసిన కాశీలో సేవ చేయగలిగినందుకు నేను కృతజ్ఞుడను అని అన్నారు. ఆమె జునగర్ నుంచి ఎన్నో గిరిజన కుటుంబాలను మహేశ్వర్కు తీసుకువచ్చి వారికి మహేశ్వరి చీరలను తయారు చేసే పనిని నేర్పించారని.. ఆ పని ఇప్పటికీ అనేక కుటుంబాలకు ఆదాయంగా ఉందని అన్నారు. అహల్యాబాయి అంటే అభివృద్ధి, పురోగతికి చిహ్నమని కొనియాడారు.