- రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ట్రైనింగ్ సెంటర్లు
- బ్యాంకు లోన్లు, లాటరీ, గిఫ్ట్ల పేరిట కాల్స్ చేయిస్తరు
హైదరాబాద్, వెలుగు: స్థానిక భాష తెలిసిన వారితో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హిందీతోపాటు దక్షిణాది భాషలు తెలిస్తే చాలు కాల్సెంటర్ ఎంప్లాయీస్ తరహాలో ప్రొఫెషనల్ వర్క్ అప్పగిస్తున్నారు. షెల్టర్, జీతం, కలెక్షన్ను బట్టి కమీషన్స్ కూడా ఇస్తున్నారు. బ్యాంక్ లోన్లు, లాటరీ, గిఫ్ట్స్, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ మోసగించేందుకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి తెలుగుతో పాటు ఇతర భాషలు మాట్లాడే వారిని నియమించుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. మారుమూల గ్రామాల్లో ట్రైనింగ్ సెంటర్స్, కాల్సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. చదువు లేకపోయినా, కంప్యూటర్పై అవగాహన లేకపోయినా బేసిక్ ఫోన్లతోనే అందినంత దోచేస్తున్నారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ కస్టమర్లను టార్గెట్ చేసి అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఇందుకు వీరికి ఎదుటి వారితో మాట్లాడి నమ్మించే స్కిల్స్ ఉంటే చాలు. కేవైసీ, కస్టమర్ కేర్ సర్వీస్, పార్ట్టైమ్ జాబ్స్, లాటరీలు, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్, సర్వీసెస్ చార్జి, ట్యాక్స్లు, జీఎస్టీ పేరుతో అందినంత దోచేస్తున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు చీట్ చేసిన మోసగాళ్ల కేసుల వివరాలను రాబట్టారు.
దక్షిణాది భాషల వారే టార్గెట్గా..
ఉత్తర భారతంలో ఎక్కువగా హిందీ మాట్లాడే వారు ఉండగా దక్షిణ భారత భాషలు మాట్లాడడం సైబర్ నేరగాళ్లకు సమస్యగా మారింది. హైదరాబాద్ తప్ప రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటకలో స్థానిక భాషల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇందుకోసం తెలుగు సహా ఇతర దక్షిణాది భాషలకు చెందిన వారిని సైబర్ క్రిమినల్స్ ట్రాప్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో ఉంటుంటారు. క్యాబ్స్,ఆటో డ్రైవర్లతో పాటు లోకల్ కన్సల్టెన్సీల ద్వారా నెట్వర్క్ పెంచుకుంటారు. చదువుతో సంబంధం లేకుండా ఆయా భాషల్లో స్పష్టంగా మాట్లాడే వారిని ఎంపిక చేసుకుని ఈజీ మనీ ఆశ చూపుతున్నారు.
వంద మందికి కాల్చేస్తే కమీషన్ ఇస్తమని..
రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బ్యాంక్ అధికారులుగా మాట్లాడడం దగ్గర్నుంచి ట్రాప్ చేసేవరకు ట్రైనింగ్ ఇస్తారు. హిందీ మాట్లాడే వారికి నార్త్ ఇండియా, దక్షిణాది భాషలు మాట్లాడే వారికి ఆయా రాష్ట్రాల ఫోన్ నంబర్లు అందిస్తారు. బేసిక్ ఫోన్స్తో కాల్స్ చేయిస్తారు. జీతంతో పాటు డైలీ టార్గెట్స్ చేసేవారికి కొట్టేసిన డబ్బులో 30 శాతం వరకు కమీషన్ ఇస్తామని ఆశ చూపిస్తారు. ఇలా రోజు 100 మందికి కాల్స్ చేయిస్తుంటారు. ఇందులో కనీసం 10 మందికి పైగా కస్టమర్లను ట్రాప్ చేసేలా స్కెచ్ వేస్తారు. కాల్స్కి రెస్పాండ్ అయిన వారి అడ్రెస్ ప్రకారం పరిసర ప్రాంతాల్లో ఉండే బ్యాంక్స్ లేదా ఇతర ఆఫీసుల వివరాలు చెప్తారు. అదే ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు మాట్లాడాతారు. ఆ తర్వాత అప్రూవల్స్ పంపించి రిజిస్ట్రేషన్ ఫీజ్, సర్వీస్చార్జీలు,ట్యాక్స్ల పేరుతో అందినంతా దోచేస్తారు.
ఈజీ మనీ కోసం..
ఉత్తరాది రాష్ట్రాల్లోని వారికి హిందీ తప్ప ఇతర భాషలు రావు. దీంతో అన్ని భాషల్లో సైబర్ క్రిమినల్స్ కాల్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీలోని తెలుగువారిని ట్రాప్ చేసేందుకు స్థానికులను నియమించుకుని కాల్స్ చేయిస్తున్నారు. వారి ద్వారా నమ్మించి అందినంత దోచుకుంటున్నారు. ఈజీ మనీ కోసం కొంతమంది సైబర్ నేరగాళ్లతో కలిసి పని చేస్తున్నారు. పోలీసులకు దొరికి జైలుకెళ్తున్నారు.
– హరినాథ్, ఏసీపీ, సైబర్ క్రైమ్, రాచకొండ
లక్షలు పోసి కొని.. మూలన పడేసిన్రు
గోల్కొండ కోటకు వచ్చే వీఐపీలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సౌకర్యం కోసం రూ.లక్షలతో కొనుగోలు చేసిన బ్యాటరీ వెహికల్స్ మూలనపడ్డాయి. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. తుప్పుపడుతున్నాయి. పురావస్తు శాఖ వాటిని కొనుగోలు చేయగా డ్రైవర్లు లేకపోవడంతో 3 నెలలకే మూలన చేరాయి. దీంతో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు కోట అందాలను చూడకుండానే నిరాశతో వెళ్తున్నారు. పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే వెహికల్స్ మూలనపడ్డాయని కోటకు వచ్చే పర్యాటకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బ్యాటరీ వెహికల్స్ను రిపేర్ చేయించి తిప్పాలని కోరుతున్నారు. - వెలుగు, మెహిదీపట్నం