ఎస్ఓటీ, మియాపూర్ పోలీసుల జాయింట్ఆపరేషన్
నిందితుల్లో మేఘాలయ ఎంజీ వర్సిటీ మాజీ డైరెక్టర్, క్లర్క్
శేరిలింగంపల్లి, వెలుగు : హైదరాబాద్ లో కొన్నేండ్లుగా ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల దందా చేస్తూ కోట్లు దండుకుంటున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ఓ బాధిత విద్యార్థి ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఒక మహిళ సహా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈదందాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మిల్లీగోయెల్(52) గతంలో డైరెక్టర్గా పని చేశాడు. ఇతనితో పాటు అక్కడే శివాని క్లర్క్గా పని చేసింది. వీరికి ఢిల్లీలో ఏసీకే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్నిర్వహిస్తున్న దినేశ్సింగ్(33), అఖిలేశ్ సేహ్వాల్(41), తాజిందర్సింగ్(36)తో పరిచయం ఏర్పడింది.
వీరితో పాటు సికింద్రాబాద్ మెట్టుగూడలో ఎస్ఎస్ డిస్టెన్స్ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వాహకుడు గరికపాటి వెంకటభాస్కర సత్యనారాయణశర్మ(49), రిసెప్షనిస్టుగా పని చేస్తున్న సింగారపు సుజాత(38), గచ్చిబౌలి టీసీఎస్లో సాఫ్ట్ వేర్ డెవలపర్గా పని చేస్తున్న గీరుకు ప్రేమ్కుమార్(29) ముఠాగా ఏర్పడ్డారు. వీరు డిస్టెన్స్ఎడ్యుకేషన్ పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తూ రూ. కోట్లు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 430 ఫేక్సర్టిఫికెట్లు విక్రయించిన ఈ ముఠా ఒక్కొక్క స్టూడెంట్ నుంచి రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు వసూలు చేశారు.
ఏపీ విద్యార్థి ఫిర్యాదుతో..
ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన షేక్ఖాజా నయాబ్రసూల్నాలుగు నెలల కింద నగరానికి వచ్చి మియాపూర్లో ఉంటున్నాడు. ఇంటర్పూర్తి చేసిన ఇతను డిస్టెన్స్ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేయాలనుకున్నాడు. అంతకుముందే పరిచయం ఉన్న ప్రేమ్కుమార్ను సలహా కోరాడు. ప్రేమ్కుమార్అతనికి సత్యనారాయణశర్మని పరిచయం చేశాడు. బీఎస్సీ(ఐటీ) డిగ్రీ చదవాలనుకుంటున్నట్టు రసూల్ చెప్పగా మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ద్వారా ఆన్లైన్ పరీక్ష రాయించి సింగిల్సిట్టింగ్లో సర్టిఫికెట్ ఇప్పిస్తానని శర్మ నమ్మబలికాడు. పాస్పోర్ట్ఫొటో, ఇంటర్ మెమో, ఐడీ ప్రూఫ్తో పాటు రూ. 2.10 లక్షలు ఫీజు చెల్లించాలన్నాడు. రసూల్రూ. 2.07 లక్షలు ఫీజు ప్రేమ్కుమార్కు ఫోన్పే ద్వారా చెల్లించాడు.
కొన్ని రోజులకు రసూల్వాట్సాప్కు ఎంజీ యూనివర్సిటీ నుంచి 2014–15, 2015–16 అకడమిక్ఇయర్స్కు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లు వచ్చాయి. వీటిని వెరిఫై చేసిన రసూల్ అవి నకిలీ సర్టిఫికెట్లని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు ప్రేమ్కుమార్, శర్మలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎనిమిది మంది నిందితుల్లో మిల్లీగోయెల్, శివాని పరారీలో ఉన్నారు. మిగిలిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ. 50 వేల నగదు, 157 మార్క్స్ మెమోలు, 9 ల్యాప్టాప్లు, సీపీయూ, ఫేక్ స్టాంప్స్, ఎంజీ యూనివర్సిటీ ఎన్వలప్స్, ఐడీ కార్డ్స్లెటర్ప్యాడ్స్, బిల్బుక్స్స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ. 37, 45, 345 సీజ్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.