- ఆరు నెలల్లో రూ.96 కోట్లు కొట్టేసిన్రు
- రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతోన్న సైబర్ మోసాలు
- ఏజెంట్ల సాయంతో ఫ్రాడ్ చేస్తున్న నేరగాళ్లు
- అమౌంట్ రికవరీలో పోలీసులకు సవాళ్లు
హైదరాబాద్,వెలుగు: ఫేక్ బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ దోపిడీకి అడ్డాగా మారాయి. ఏజెంట్స్ అందించే బ్యాంక్ అకౌంట్స్,ఫేక్ సిమ్ కార్డులతో సైబర్ నేరగాళ్లు ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ ఏజెంట్లు పోలీసులకు పట్టుబడుతున్నా.. కొట్టేసిన డబ్బులు మాత్రం రికవరీ కావడం లేదు. దీంతో రికవరీ శాతం తగ్గిపోతోంది. ఇలాంటి కేసుల్లో బాధితులు కోల్పోయిన డబ్బును రికవరీ చేయడంపై పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేన్నారు. గతేడాది జూన్ 16 నుంచి డిసెంబర్ వరకు 6 నెలల వ్యవధిలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్పీ) టోల్ ఫ్రీ నంబర్ 155260కి వచ్చిన కాల్స్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.96 కోట్లు కొట్టేయగా.. ఇందులో కేవలం రూ.5 కోట్ల 12 లక్షలను మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. సైబర్ నేరగాళ్లు ఈ మోసాల కోసం 6,621 బ్యాంక్ అకౌంట్లు, 22,319 ఫోన్ నంబర్లను వాడినట్లు పోలీసులు గుర్తించారు.
నార్త్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్స్
ప్రతి ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో నైజీరియన్ గ్యాంగ్స్ సభ్యులే ప్రధాన నిందితులుగా ఉంటున్నారు. నైజీరియన్ గ్యాంగ్ ఢిల్లీ, ముంబయితో పాటు విదేశాల్లో ఉంటూ ఆన్లైన్ అడ్డాగా ఫ్రాడ్ చేస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఫేక్ బ్యాంక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నాయి. యూపీ, బిహార్,రాజస్థాన్, జార్ఖండ్ సహా నార్త్ ఇండియాలోని ఏజెంట్ల ద్వారా బ్యాంక్ అకౌంట్లను కలెక్ట్ చేస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్, ఓటీపీ, సీవీవీ నంబర్ సహా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన పూర్తి పిన్ నంబర్స్ తమ కస్టడీలో పెట్టుకుంటున్నాయి. బాధితుల నుంచి కొట్టేసిన డబ్బును ఏజెంట్స్ అందించిన అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నాయి. ఆ డబ్బును ఈ– వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత విత్డ్రా చేసుకుంటున్నాయి.
10 నుంచి 25 శాతం కమీషన్
ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందించిన ఏజెంట్లకు సైబర్ మోసాలు చేసే గ్యాంగ్స్10 నుంచి 25 శాతం కమీషన్ ఇస్తున్నాయి. ఇలాంటి నేరాల్లో సైబర్ ఏజెంట్లు చిక్కినా డబ్బు రికవరీలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. విత్డ్రా చేసిన క్యాష్తో పాటు సైబర్ నేరాలకు పాల్పడే ప్రధాన నిందితులు చిక్కకపోడంతో రికవరీ చేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన నిందితులు దొరికినప్పటికీ వారి వద్ద ఎలాంటి క్యాష్ ఉండటం లేదు. ప్రాపర్టీస్కి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా దొరక్కపోవడంతో ఇంటర్ స్టేట్ ఏజెంట్స్ ను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపుతున్నారు. దీంతో ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్టపడడం లేదు.సైబర్ మోసాలకు జనాలు అలర్ట్ గా ఉండాలని సిటీ సీసీఎస్ డీసీపీ గజరావు భూపాల్ అన్నారు. నైజీరియన్ గ్యాంగ్ లు ఫేక్ అకౌంట్లతోనే మోసాలు చేస్తున్నాయన్నారు. నైజీరియన్స్ ఏజెంట్లతో కూడా ఆన్లైన్లోనే కాంటాక్ట్ అవుతున్నారన్నారు. ఫేక్ అకౌంట్లలో డిపాజిట్ అయ్యే అమౌంట్ను ఆన్లైన్లోనే కొట్టేస్తున్నారన్నారు. ఇలాంటి నేరాల్లో పట్టుబడ్డ వారి డేటా ఆధారంగా ఫేక్ బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్స్ డేటా కలెక్ట్ చేస్తున్నామన్నారు.