హైదరాబాద్, వెలుగు: ఫింగర్ ప్రింట్స్ క్లోనింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఆధార్ నంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు కొట్టేస్తున్న 9 మంది సభ్యుల ముఠాలో ఆరుగురిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వీరి వద్ద పాలి స్టాంపర్ మిషన్, బయోమెట్రిక్ మిషన్, జెల్ లిక్విడ్ బాటిల్స్, 13 డెబిట్ కార్డులు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత, ఏసీపీ శివ మారుతితో కలిసి జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ బుధవారం కేసు వివరాలను వెల్లడించారు.
ఓటీపీ లేకుండానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో నివాసం ఉండే నంద్యాల అసాధరణ్ అలియాస్ రూపేశ్(25) పీఓఎస్ ద్వారా ఓటీపీ లేకుండానే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగే విధానం గురించి తెలుసుకున్నాడు. ఖాతాదారుల ఫింగర్ ప్రింట్తో లింక్ అయిన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేందుకు ప్లాన్ చేశాడు. దీంతో ఫింగర్ ప్రింట్స్ తయారీ కోసం ఫ్లిప్కార్ట్లో ‘ఇమేజ్ ప్యాక్ స్టాంప్ మిషన్’ పాలిమార్ లిక్విడ్ జెల్, పాలిథిన్ పౌడర్, బయోమెట్రిక్ మిషన్స్ కొనుగోలు చేశాడు. పీఓఎస్ సిస్టమ్తో రూ.9999 వరకు క్యాష్ విత్డ్రా చేసే అవకాశం ఉండడంతో దోచేసేందుకు ప్లాన్ చేశాడు.
ఖమ్మం మీ సేవా నుంచి ల్యాండ్ డాక్యుమెంట్లు..
ఏపీ ప్రకాశం జిల్లాకు చెందిన సగితి ఉదయ్కిరణ్ (22), నరేందర్ (25), శేరిలింగంపల్లికి చెందిన మహ్మద్ ఇయాజ్(24), బీరంగూడకు చెందిన రాచర్ల శివకృష్ణ (19), నిజాంపేటకు చెందిన కుల్ల శ్రీనుల(20)తో కలిసి రూపేశ్ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. పథకం ప్రకారం మర్చంట్ పోర్టల్లో పీఓఎస్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ఖమ్మంలోని మీ సేవా సెంటర్ నుంచి ఒక్కో ఫింగర్ ప్రింట్కు రూ.40 చొప్పున చెల్లించి, 2,500 ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సేకరించారు. ఇలా సేకరించిన డాక్యుమెంట్స్ ద్వారా 1,000 మందికి చెందిన ఫింగర్ ప్రింట్స్ తయారు చేశారు. మర్చంట్ ఐడీతో లాగిన్ అయ్యి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపారు. ఇలా శ్రీను మర్చంట్ ఐడీ నుంచి మూడ్రోజుల్లో రూ.10 లక్షలు కొట్టేశారు.
ఇలా దొరికారు..
ఫినో మర్చంట్ పేమెంట్స్లో బ్యాంక్ ఖాతాదారుల ప్రమేయం లేకుండానే ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. సెప్టెంబర్25న ఫినో పేమెంట్స్ సంస్థకు సమాచారం అందించింది. ఇందులో కుల్ల శ్రీను బిజినెస్ మర్చంట్ ఐడీ టెర్మినల్ ద్వారా మూడు, నాలుగు రోజుల్లోనే రూ.10 లక్షల విలువ చేసే ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించింది. దీంతో గత నెల 18న రీజినల్ హెడ్ నరేశ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ్యాబ్రికేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ద్వారా బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు కొట్టేసినట్లు గుర్తించారు. బాధితుల రూ.5 లక్షలు తిరిగి వారి అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేశామని జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ తెలిపారు.