- ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి టెలీ కాలర్స్ గా రిక్రూట్
- వారితో కస్టమర్లకు కాల్స్ చేయించి ఆన్ లైన్ మోసాలు
- ఢిల్లీ, నోయిడా, బెంగళూర్, వెస్ట్ బెంగాల్ అడ్డాగా ఫేక్ కాల్ సెంటర్స్
- పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న టెలీ కాలర్స్, తప్పించుకుంటున్న ప్రధాన నిందితులు
- ఇలాంటి జాబ్ ల విషయంలో అలర్ట్గా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ మోసాల కోసం నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తున్నారు. టెలీ కాలర్ ఉద్యోగాల పేరుతో ట్రాప్ చేసి సైబర్ మోసాల్లో వారిని ఇరికిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడటం వస్తే చాలు.. ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండానే జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఎంఎన్సీ కంపెనీల మధ్య కార్పొరేట్ ఆఫీసులు ఓపెన్ చేసి అట్రాక్ట్ చేస్తున్నారు. ఫారిన్ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ వర్క్ చేస్తున్నట్లు టెలీకాలర్లుగా రిక్రూట్ అయిన వారిని నమ్మించి ఫేక్ ఐడీలు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు. బ్యాంక్ లు, ఈ– కామర్స్ సైట్ల కోసం థర్డ్ పార్టీ కస్టమర్ కేర్ సెంటర్స్ ను నడుపుతున్నట్లు చెబుతూ సైబర్ మోసాలు చేయిస్తున్నారు. డార్క్వెబ్ సైట్స్, ఏజెన్సీల నుంచి పబ్లిక్ ఫోన్ నంబర్ల డేటాబేస్ను కొనుగోలు చేస్తున్నారు. యూపీ, నోయిడా, ఢిల్లీ కేంద్రంగా ఫేక్ కాల్సెంటర్స్ ఏర్పాటు చేసి భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్తో కాల్ సెంటర్స్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం తరహాలో ఫ్రాడ్ చేస్తున్న మరో రెండు ముఠాలను సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వీటితో పాటు బ్యాంక్ లోన్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్, ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్ సహా ఆన్లైన్ మోసాల్లో ఫేక్ కాల్ సెంటర్లు కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, నోయిడా, బెంగళూర్, వెస్ట్బెంగాల్ సహా నార్త్ ఇండియాలో ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్లో కాల్ సెంటర్లు పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఫేక్ అడ్రస్లతో సిమ్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు క్రియేట్ చేసి వరుస మోసాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు.
సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి సర్టిఫికెట్లు తీసుకుని..
సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తమని, జీతం కంటే ఎక్కువగా కమీషన్ వస్తుందంటూ సైబర్ నేరగాళ్లు యువతను ట్రాప్ చేస్తున్నారు. అమ్మాయిలనే ఎక్కువగా టెలీకాలర్స్గా రిక్రూట్ చేసుకుంటున్నారు. జాయిన్ అయిన వారి సర్టిఫికెట్లను తమ ఆధీనంలో పెట్టుకుంటున్నారు. టెలీ కాలర్ గా జాయిన వారి స్మార్ట్ ఫోన్లను ఆఫీస్ పరిస ప్రాంతాల్లోకి అనుమతించకుండా బేసిక్ ఫోన్లు చేతికి ఇస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడే వారికి ఇంపార్టెన్స్ ఇస్తూ, అవతలి వారిని నమ్మించే విధంగా అమ్మాయిలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో రూపొందించిన డేటాబేస్ను వాడుతున్నారు. ఒక్కో క్యాబిన్లో కేవలం 8 నుంచి 15 మందిని మాత్రమే నియమించి, ఒకరి కాలర్ను మరొకరు సంప్రదించకుండా ఐడీలు ప్రిపేర్ చేస్తున్నారు.
సీసీటీవీ కెమెరాలతో నిఘా..
కాల్ సెంటర్లో పనిచేసే ప్రతి ఒక్కరిని ఆర్గనైజర్లు పరిశీలిస్తుంటారు. అనుమానాస్పదంగా ప్రవర్తించే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలు వాయిస్ రికార్డర్స్తో నిఘా పెడతారు. టెలీకాలర్స్ యాక్టివిటీని గమనించేందుకు మేనేజర్లు, సూపర్ వైజర్లు ఉంటారు. ఒక్కో టెలీకాలర్ రోజుకు సుమారు 100 నుంచి 180 కాల్స్ చేయాలని టార్గెట్ విధిస్తారు. కనీసం 75 శాతం కాల్స్ నుంచి తమకు కావల్సిన సమాచారం రాబడుతారు. ఇలాంటి టార్గెట్ రీచ్ అయిన వారికి కమీషన్స్, గిఫ్ట్స్తో ఆశ చూపుతారు. ఈ క్రమంలోనే తమ వద్ద పనిచేసే మిగతా టెలీ కాలర్స్ను ఆఫర్స్ పేరుతో అట్రాక్ట్ చేస్తారు. జీతాలు బ్యాంకుల నుంచి కాకుండా క్యాష్ రూపంలోనే చెల్లిస్తారు. సైబర్ నేరాలతో కలెక్ట్ చేసిన క్యాష్ను డిపాజిట్ చేసేందుకు టెలీకాలర్స్కు చెందిన బంధువులు, ఫ్రెండ్స్ అకౌంట్లను సేకరిస్తారు. ఇందుకోసం వారికి ప్రతి నెల కమీషన్ చెల్లిస్తారు.
మెట్రో సిటీలే టార్గెట్
సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువ శాతం మందికి హిందీ అర్థమవడం, మాట్లాడటం వచ్చు. దీంతో హిందీ మాట్లాడటం తెలిసిన స్థానిక యువతనే టెలీ కాలర్స్ గా నియమించుకుని కాల్స్ చేయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూర్, చెన్నైలాంటి మెట్రో సిటీలను టార్గెట్ చేసేందుకు స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడే వారిని టెలీకాలర్స్గా నియమిస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్,ఈ – కామర్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ లాంటి ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ను ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ఇలాంటి కాల్ సెంటర్లపై పోలీసులు రెయిడ్స్ చేసిన సమయంలో ఆఫీస్ మేనేజర్ ,టీమ్ లీడర్లు, టెలీకాలర్స్ మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. అసలైన సైబర్ నేరగాళ్లు తమ ఆనవాళ్లు కూడా వదలడం లేదు. సైబర్ క్రైమ్ కేసుల్లో టెలీ కాలర్లను పోలీసులు విచారిస్తున్నారు. చీటింగ్లో వారి ప్రమేయం ఉందని తెలితే అరెస్ట్ చేస్తున్నారు.
‘ వెస్ట్ బెంగాల్కు చెందిన సైబర్ నేరగాళ్లు మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లో ఫేక్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. హిందీ,ఇంగ్లీష్ మాట్లాడం వచ్చిన సిటీకి చెందిన యువతీ యువకులను టెలీ కాలర్స్ గా రిక్రూట్ చేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లిమిట్, సబ్స్క్రిప్షన్, ఇంటర్నెట్ స్పీడ్ పెంచుతామని వారితో కస్టమర్లకు కాల్స్ చేయించేవారు. టెక్ సపోర్టర్ పేరుతో లింకులు పంపించి అందినంత దోచేసేవారు. ఇలాంటి మోసాలకు పాల్పడ్డ 15 మంది టెలీకాలర్స్ ఈ ఏడాది ఏప్రిల్ 5న రెయిడ్స్లో సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు.కానీ అసలు నేరగాళ్లు మాత్రం చిక్కలేదు.’
‘సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ పంజాగుట్టలో ఫేక్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటకకు చెందిన యువతీ యువకులను టెలీకాలర్స్గా నియమించాడు. నెలకు రూ.25 వేలు జీతం, కమీషన్ ఇస్తామని ఆశచూపాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల పేరుతో కాల్స్ చేయించేవాడు.సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో నెల రోజుల వ్యవధిలోనే రూ.50 లక్షలు వసూలు చేశాడు. ఏప్రిల్ 30న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు జరిపిన రెయిడ్స్లో 11 మంది మహిళలు సహా 32 మంది టెలీకాలర్స్ దొరికారు. ప్రధాన నిందితుడు చక్రధర్ గౌడ్ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు.
స్థానికులతోనే మోసాలు చేయిస్తున్నరు
సైబర్ నేరగాళ్లు స్థానికులతోనే కాల్ సెంటర్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. వారినే ఎండీలుగా చేస్తారు. స్థానిక యువతనే టెలీ కాలర్స్ గా నియమించుకుంటారు. ఆపరేషన్స్ అన్నీ తమ ఆధీనంలో పెట్టుకుంటారు.సైబర్ నేరాల గురించి టెలీకాలర్స్కు తెలియదు. ఐడీ కార్డుల దగ్గరి నుంచి వారి అపాయింట్మెంట్ లెటర్ వరకు అన్నీ ఒరిజినల్గా కనిపిస్తాయి. నిజమైన కంపెనీగా నమ్ముతారు. కస్టమర్లను కూడా కమాండ్ చేసే స్థాయిలో టెలీ కాలర్స్ తో మాట్లాడిస్తారు. ఇలాంటి కాల్ సెంటర్లతో దేశవ్యాప్తంగా మోసాలు జరుగుతున్నాయి. టెలీకాలర్ జాబ్స్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్రాడ్ జరుగుతున్న విషయం తెలిస్తే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ కు సమాచారం ఇవ్వాలి.
- కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్