బిజినెస్ డెస్క్, వెలుగు: మనదేశంలో కంప్యూటర్, స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. లాటరీ వచ్చిందనో, గిఫ్ట్ వచ్చిందనో, కేవైసీ అప్డేట్ చేయాలనో చెప్పి సైబర్ నేరగాళ్లు పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని డబ్బు కాజేస్తున్నారు. మరికొందరు క్రెడిట్కార్డు డీటెయిల్స్ దొంగిలించి అందులోని డబ్బును వాడుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లతో మోసం చేసే వాళ్లు ఇంకొందరు. కార్డ్ స్కిమ్మింగ్, లోన్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ ద్వారా నేరాలు చేసేవాళ్లూ ఉన్నారు. సిమ్కార్డును దొంగతనంగా పొంది సైబర్ నేరాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల బారి నుంచి రక్షించుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్సెంటరును నడుపుతున్నది. అయితే నేరం జరిగిన 48 గంటలలోపు కంప్లైంట్ ఇస్తే డబ్బులు వాపసు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ సీసీఎస్ ఎస్ఐ గడ్డం మల్లేశ్ చెప్పారు.
పోర్టల్లో కంప్లైంట్ ఇలా ఇవ్వాలి..
1. మొదట ‘https://cybercrime.gov.in/’ వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో ‘ఫైల్ ఏ కంప్లైంట్’ అనే బటన్ పై క్లిక్ చేయండి. తరువాత ‘రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్’ బటన్ మీద క్లిక్ చేయండి.
2. ఇక్కడ ‘సిటిజన్ లాగిన్’ ఆప్షన్ ఎంచుకొని రిజిస్టర్ న్యూయూజర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇందుకోసం మొబైల్లో వచ్చిన ఓటీపీని, క్యాప్చాను ఎంటర్ చేసి ‘సబ్మిట్’ బటన్ క్లిక్ చేయాలి. రాష్ట్రం, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను కూడా అందజేయాలి.
3. ఆ తర్వాతి స్క్రీన్లో నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలి. ఘటన వివరాలు, అనుమానితుల సమాచారం, కంప్లైంట్కు సంబంధించిన ప్రాథమిక వివరాలు టైప్ చేయాలి. ఇవన్నీ నింపి సబ్మిట్ బటన్ నొక్కాలి.
4. ఇప్పుడు కంప్లైంట్ పేజీ వస్తుంది. ఇందులో ఫిర్యాదు రకం, సబ్– కేటగిరీని పేర్కొనాలి. నేరం జరిగిన తేదీ/ సమయం/ప్రదేశం/ప్లాట్ఫామ్ను తెలియజేయాలి. రిపోర్టింగ్ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరించాలి.
5. మీ సోషల్ మీడియా ఖాతా వివరాలు, వెబ్సైట్ అడ్రస్ను ఎంటర్ చేయాలి. నేరానికి సంబంధించిన ఆధారాలు.. అంటే స్క్రీన్షాట్స్, టెక్స్ట్ మెసేజ్ల వంటి ఫొటోలు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ‘సేవ్ అండ్ నెక్స్ట్’ బటన్ పై క్లిక్ చేయాలి. పేరు, ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా టైప్ చేయాలి. తెలిస్తే అనుమానితుల వివరాలనూ ఇవ్వాలి.
6. ఈ దశలో మీ ఈ–-మెయిల్ ఐడీ, అడ్రస్, ఫోటో వంటి వివరాలను అప్లోడ్ చేయాలి. ఇచ్చిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, కంప్లైంట్ను అప్లోడ్ చేసేందుకు ‘కన్ఫర్మ్ అండ్ సబ్మిట్’ బటన్ను నొక్కాలి.
7.మన వివరాలు అందించడం ఇష్టం లేకుంటే ‘కంప్లైంట్ ఎనామస్లీ’ అనే ఆప్షన్ ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు.
హైదరాబాదులో భారీగా సైబర్ క్రైమ్స్
సిటీలో రోజుకు కనీసం 40 సైబర్క్రైమ్స్ జరుగుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. మోసాల విలువ రూ.2 లక్షల నుంచి రూ 40 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అందుకే ప్రతిరోజూ హెల్ప్లైన్ కు భారీగా కాల్స్ వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు నెలకు తెలంగాణ నుండి రూ .12 కోట్లకు పైగా దోచుకుంటున్నారు. దొంగతనాలు వంటి సాధారణ నేరాలలో కోల్పోయిన మొత్తం కంటే ఇదే ఎక్కువ. కేంద్రం ఈ ఏడాది జూన్లో155260 హెల్ప్లైన్ మొదలుపెట్టగా ఇప్పటికే 2,513 మంది బాధితులు ఫోన్ చేశారు. రోజుకు కనీసం దాదాపు 40 మంది బాధితులు ఈ నంబరుకు డయల్ చేస్తున్నారు. ఇప్పటికే రూ.24 కోట్ల విలువైన సైబర్ ఫ్రాడ్స్ గురించి కంప్లైయింట్ చేశారు. ఇందులో 1.5 కోట్లను రికవరీ చేయగలిగారని సీసీఎస్ ఆఫీసర్ ఒకరు చెప్పారు.
కాల్సెంటర్కు కంప్లైంట్ చేసే విధానంః
- సైబర్ ఫ్రాడ్ వల్ల మన డబ్బు పోయిందని తెలియగానే 155260 నంబరుకు కంప్లైంట్ చేయాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లైంట్ ఇవ్వాలి. ఈ కాల్సెంటర్లోని సైబర్ ఎక్స్పర్టులు బాధితులకు సాయపడతారు. 48 గంటలలోపు కంప్లైంట్ ఇస్తే డబ్బు వాపసు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- ముందుగా మోసం జరిగిన విధానం గురించి తెలుసుకున్నాక ఒక వాట్సాప్ నంబరు ఇస్తారు. ఆ నంబరుకు ‘హాయ్’ అని మెసేజ్ పెట్టాలి. రిప్లైగా ఒక టెంప్లేట్ పంపిస్తారు. ఇందులో బాధితులు తమ వివరాలన్నీ ఇవ్వాలి. అడ్రస్, మోసం జరిగిన విధానం, ప్లాట్ఫామ్ పేరు, అనుమానితుని పేరు, కార్డు వివరాలు, రిఫరెన్స్ నంబర్లు, ట్రాన్సాక్షన్ స్క్రీన్షాట్లు ఇవ్వాలి.
- ఈ వివరాలన్నింటినీ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్కు పంపిస్తారు. అక్కడి నుంచి ఈ కంప్లైంట్ సంబంధిత బ్యాంకు/ఫ్లాట్ఫామ్/లెండర్ నోడల్ ఆఫీసర్కు వెళ్తుంది. దాదాపు రెండు గంటల్లోపు రిప్లై వస్తుంది.
- నోడల్ ఆఫీసర్ మోసగాళ్ల అకౌంట్ను ఫ్రీజ్ చేస్తారు. కంప్లైంట్ త్వరగా అందితే డబ్బు వెంటనే వాపసు వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బాధితుడి తరఫున 155260 కాల్ సెంటర్ స్టాఫ్ కేంద్ర హోంమంత్రిత్వశాఖ నడిపే సైబర్ క్రైమ్ పోర్టల్కు కంప్లైంట్ చేస్తారు. కావాలంటే బాధితుడే కంప్లైంట్ చేసుకోవచ్చు.