- సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోయినా సైబర్ మోసానికి గురయ్యామన్న ఎంపీ
- కాల్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో మాలిషియస్ యాప్ ఇన్స్టాల్ అయి ఉండొచ్చన్నఎక్స్పర్ట్లు
బిజినెస్ డెస్క్, వెలుగు : కామన్ మ్యానే కాదు ఎంపీలు కూడా సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోతున్నారు. తమిళనాడు ఎంపీ దయానిధి మారన్ బ్యాంక్ అకౌంట్ నుంచి కిందటి వారం రూ. లక్ష మాయమయ్యాయి. ఓటీపీ, ఇతర సెక్యూరిటీ విధానాలు అమలవుతున్నా బ్యాంక్ ఫ్రాడ్స్ మాత్రం తగ్గడం లేదు. మాలిషియస్ (ప్రమాదకరమైన) యాప్లు ఇన్స్టాల్ అయి ఉంటే యూజర్లకు వచ్చే ఓటీపీలు, ఎస్ఎంఎస్లను మోసగాళ్లు చదవగలుగుతున్నారు. వెంటనే డిలీట్ చేస్తున్నారు. దీనికి తోడు బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేసి అకౌంట్ హోల్డర్ల పర్సనల్ డేటాను కాజేయడం పెరుగుతోంది. తన యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. లక్ష మాయమయ్యాయని ఈ వారం స్టార్టింగ్లో ట్విట్టర్లో దయానిధి మారన్ పేర్కొన్నారు. నెట్బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ డబ్బులను సైబర్ మోసగాళ్లు కాజేశారని చెప్పారు. బ్యాంక్ దగ్గర రిజిస్టర్ చేసుకున్న నెంబర్కు ఓటీపీ రాలేదని అన్నారు. తన భార్యతో కలిసి తీసుకున్న జాయింట్ అకౌంట్ కావడంతో ఆమెకు కాల్ వచ్చిందని వెల్లడించారు. ఆమె ఎటువంటి సెన్సిటివ్ వివరాలను షేర్ చేయకపోయినా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 99,999 మాయమయ్యాయని వివరించారు. ఏదైనా ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి సర్వర్ అడిగే పర్మిషనే ఓటీపీ అని సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ శంకర్ పేర్కొన్నారు. సర్వర్లను మోసం చేయడానికి మార్గాలున్నాయని చెప్పారు.
సైబర్ మోసాల నుంచి బయటపడేందుకు టిప్స్..
1) కాల్స్ పికప్ చేసే ముందు ఫోన్ నెంబర్ను వెరిఫై చేసుకోవాలి. తెలియని వాళ్లతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవద్దు.
2) వాట్సాప్ కాల్స్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ను ఎత్తక పోవడం బెటర్.
3) మొబైల్ ఫోన్, కంప్యూటర్లోని మాల్వేర్ను తొలగించడానికి లేదా ఇతర ఇష్యూస్ని పరిష్కరించడానికి రిమోట్ యాక్సెస్ ఎవరికీ ఇవ్వొద్దు.
4) సైబర్ ఫ్రాడ్ జరిగితే వెంటనే సంబంధిత బ్యాంక్ను సంప్రదించండి.
పెరుగుతున్న వాయిస్ ఫిషింగ్..
ఈ మధ్య కాలంలో వాయిస్ ఫిషింగ్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి అకౌంట్ హోల్డర్లకు ఓటీపీలు అడుగుతున్నారు. పర్సనల్ వివరాలను చెప్పి వీరి నమ్మకాన్ని పొందుతున్నారు. పాస్వర్డ్లు, ఓటీపీలు, పిన్ వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను అకౌంట్ హోల్డర్ల నుంచి రాబట్టేందుకు గుర్తు తెలియని ట్రాన్సాక్షన్ జరిగిందనో లేదా మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుందనో సైకలాజికల్ విధానాలను వాడుతున్నారు. దయానిధి కేసు చూస్తే ఆయన భార్యకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి చాలాసార్లు కాల్స్ వచ్చాయి. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారని దయానిధి మారన్ పేర్కొన్నారు. తన భార్య ఎటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదని వెల్లడించారు. ‘పర్సనల్ డేటా పొందడం, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ను ఈజీగా బ్రీచ్ చేయడం చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇది ఫిషింగ్ అటాక్ కాదు. ఎటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోలేదు’ అని దయానిధి మారన్ ట్విట్టర్లో వెల్లడించారు. ఆయన భార్య ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేదా ఆమె ఏదైనా లింక్ను క్లిక్ చేసినప్పుడు ఆమె ఫోన్లో మాలిషియస్ యాప్ ఇన్స్టాల్ అయి ఉండొచ్చని సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ వెల్లడించారు. ఓటీపీ లేదా ఎస్ఎంఎస్ రాగానే వాటిని చదివేసి డిలీట్ చేసి ఉంటారని అన్నారు. మరోవైపు సిమ్ క్లోనింగ్ కూడా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ విధానంలో ఫేక్ సిమ్ కార్డును క్రియేట్ చేసి కొంత కాలం వరకు యూజర్లకు వచ్చే మెసేజ్లను సైబర్ మోసగాళ్లు చదవడానికి వీలుంటుంది. దయానిధి మారన్ కేసుపై యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ నష్టపోయిన అమౌంట్ను తిరిగి క్రెడిట్ చేశామని, సైబర్ క్రైమ్పై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. మరోవైపు ఫిషింగ్ ఫ్రాడ్ కేసులో ఓ హెల్త్ కంపెనీ రూ.2.5 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీలను నష్టపోయింది. ఇన్వెస్టర్ అని చెప్పి ఓ గుర్తు తెలియని వ్యక్తి పంపిన లింక్లను ఈ కంపెనీ ప్రతినిధులు క్లిక్ చేశారు. అంతే వీరి క్రిప్టో అకౌంట్ నుంచి ఫండ్స్ మాయమయ్యాయి.