
- 765 పాయింట్లు డౌన్
- 232 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ముంబై: యూఎస్అదనపు టారిఫ్ ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు, విదేశీ నిధుల తరలింపు పెట్టుబడిదారులను కలవరపెట్టడంతో ఈక్విటీ బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం దాదాపు ఒక శాతం తగ్గింది. 80 వేల స్థాయి కంటే కిందికి పడిపోయింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్లలో తీవ్ర నష్టాలు కూడా ఈక్విటీలపై ఒత్తిడిని పెంచాయి.
30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 765.47 పాయింట్లు పడిపోయి 79,857.79 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 847.42 పాయింట్లు పడిపోయి 79,775.84 వద్దకు చేరింది. బీఎస్ఈలో 2,507 స్టాక్లు క్షీణించగా, 1,521 లాభాలతో ముగిశాయి. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 232.85 పాయింట్లు కుంగి 24,363.30 వద్ద ముగిసింది.
భారత ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావంపై ఆందోళన పెరుగుతోందని, ఎఫ్ఐఐల అమ్మకాలు సూచీలపై ఒత్తిడిని పెంచాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.
సెన్సెక్స్ సంస్థలలో, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ రిలయన్స్ వెనకబడి ఉన్నాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 1.56 శాతం క్షీణించగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 1.03 శాతం పడిపోయింది.
సెక్టోరల్ ఇండెక్స్లకూ నష్టాలు
అన్ని సెక్టోరల్ఇండెక్స్లు నష్టాల్లోనే ముగిశాయి. రియాల్టీ 2.09 శాతం, టెలికమ్యూనికేషన్ 1.83 శాతం, మెటల్1.82 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.68 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.62 శాతం, కమోడిటీస్ 1.55 శాతం నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) గురువారం రూ.4,997.19 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. శుక్రవారం రూ.1,365.17 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
అయితే, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) గురువారం ట్రేడ్లో రూ.10,864.04 కోట్ల విలువైన స్టాక్లను, శుక్రవారం రూ.6,794.28 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ సానుకూలంగా స్థిరపడగా, దక్షిణ కొరియా కోస్పి, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాలతో ముగిశాయి.
యూరోపియన్ మార్కెట్లు గ్రీన్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.59 శాతం పెరిగి 66.82 డాలర్లకు చేరుకుంది.