- 4 వికెట్ల తేడాతో గెలుపు
- ఇషాన్, రోహిత్ మెరుపులు వృథా
ముంబై: ఐపీఎల్–15లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. టార్గెట్ ఛేజింగ్లో ఊహించని రీతిలో ఆడి.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్కు షాకిచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 177/5 స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (32 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), ఇషాన్ కిషన్ (48 బాల్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 నాటౌట్) దంచికొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 18.2 ఓవర్లలో 179/6 స్కోరు చేసి నెగ్గింది. లలిత్ (48 నాటౌట్), అక్షర్ (38 నాటౌట్)కు తోడుగా పృథ్వీ షా (38) రాణించాడు. మూడు వికెట్లు తీసిన కుల్దీప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇ‘షాన్’
ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఇషాన్, రోహిత్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రోహిత్ 4, 6తో ఫస్ట్ ఓవర్లోనే 10 రన్స్ రాబడితే, కిషన్ ఫోర్తో ఖాతా తెరిచాడు. మూడు, నాలుగు ఓవర్లలో భారీ సిక్సర్, ఫోర్తో గేర్ మార్చాడు. ఐదో ఓవర్లో రోహిత్ 4, 6, ఇషాన్ 4తో 16 రన్స్ వచ్చాయి. దీంతో పవర్ప్లేలో ముంబై 53/0 స్కోరు చేసింది. మిడిల్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కుల్దీప్ (3/18).. 9వ ఓవర్లో రోహిత్ను ఔట్ చేశాడు. ఫలితంగా ఫస్ట్ వికెట్కు 67 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. అన్మోల్ప్రీత్ (8) పెద్దగా ఆడకపోయినా ఇషాన్ మాత్రం జోరు తగ్గించలేదు. 13వ ఓవర్లో మూడు ఫోర్లతో 13 రన్స్ సాధించాడు. తిలక్ వర్మ (22) వేగంగా ఆడినా ఎక్కువ సేపు వికెట్ కాపాడుకోలేదు. దీంతో 15 ఓవర్లకు స్కోరు 118/3కు చేరింది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న పొలార్డ్ (3) 16వ ఓవర్లో వెనుదిరిగాడు. 17వ ఓవర్లో 6, 4తో రెచ్చిపోయిన ఇషాన్ చివరి వరకు ఫోర్లు బాదాడు. టిమ్ డేవిడ్ (12) కూడా బ్యాట్ ఝుళిపించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు.
తిలక్.. అదుర్స్
స్టార్టింగ్లో సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్న ముంబై.. లాస్ట్లో నిరాశపర్చింది. ఓపెనర్ పృథ్వీ షా (38) నిలకడగా ఆడినా.. రెండో ఎండ్లో సీఫెర్ట్ (21), మన్దీప్ (0), రిషబ్ పంత్ (1) ఫెయిలయ్యారు. దీంతో ఢిల్లీ 32/3తో కష్టాల్లో పడింది. పవర్ప్లేలో ఢిల్లీ 46/3 స్కోరు మాత్రమే చేసింది. ఈ దశలో లలిత్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. 10వ ఓవర్లో మూడు బాల్స్ తేడాలో పృథ్వీ, పావెల్ (0) ఔటైనా.. లలిత్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇతనికి చివర్లో శార్దూల్ (22), అక్షర్ అండగా నిలిచారు. బుమ్రా వేసిన 11వ ఓవర్లో శార్దూల్ వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. అయితే 14వ ఓవర్లో శార్దూల్ను ఔట్ చేసిన థంపీ (3/35) ముంబైని రేస్లోకి తెచ్చాడు. ఇక 41 బాల్స్లో 74 రన్స్ చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ వీరోచితంగా పోరాడాడు. సామ్స్ వేసిన 18వ ఓవర్లో ఇద్దరు కలిసి మూడు సిక్స్లు, ఓ ఫోర్తో 24 రన్స్ పిండుకున్నారు. ఇక 12 బాల్స్లో 4 రన్స్ కావాల్సిన దశలో అక్షర్ బౌండ్రీతో విజయాన్ని అందించాడు.