
భారత క్రికెటర్ శిఖర్ ధావన్, అతని భార్య ఆయేషా ముఖర్జీకి విడాకలు మంజూరు అయ్యాయి. ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించిందన్న ధావన్ వాదనలను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని భార్య ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు అభిప్రాయపడింది.
ధావన్, ఆయేషా దంపతుల కుమారుడిని శాశ్వత కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అయితే ధావన్కు ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడిని కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. అకడమిక్ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని.. పాఠశాల సెలవుల్లో ధావన్, అతని కుటుంబ సభ్యులను కలిసేందుకు ధావన్ కొడుకును భారతదేశానికి తీసుకురావాలని ఆయేషాను కోర్టు ఆదేశించింది.