న్యూఢిల్లీ: జీ20 సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. సమిట్ జరిగే ఏరియా మొత్తం సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళల్లో ఎప్పుడూ చీకటి ఉండే వీధులు జీ20 సమిట్ కారణంగా ప్రస్తుతం వీధి లైట్లతో వెలిగిపోతున్నాయి. ఢిల్లీ సిటీ అంతా అందమైన పూలతో అలంకరించారు. గోడలకు పెయింటింగ్స్ వేశారు. ఇరుకుగా ఉండే రోడ్లను విస్తరించారు. ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సమిట్ జరిగే ప్రాంతం వరకు కొత్త రోడ్లు వేశారు.
రోడ్లకు ఇరువైపులా డిజైనర్ ఫౌంటేన్స్ పెట్టారు. ఆకర్షణీయమైన శిల్పాలు, పూల కుండీలు ఏర్పాటు చేశారు. ఫుట్పాత్లకు మరమ్మతులు చేయడంతో పాటు గోడలకు పెయింటింగ్ వేశారు. అలాగే, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జీ20 ప్రతినిధుల ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేయడానికి ప్రత్యేక గేట్లు, కారిడార్లు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వచ్చే వారి రాకపోకలకు సంబంధించి పనులను సీనియర్ అధికారుల బృందం పర్యవేక్షిస్తున్నది.
అంతేకాకుండా ఎయిర్ పోర్ట్ వద్ద ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కకు ఫైటర్ జెట్ నమూనాలు, ఫౌంటేన్లు, వివిధ దేశాల జాతీయ పతకాలు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గర్లో సింహాల స్టాచ్యూలు, గార్డెన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.