
ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్ 4న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎంపీ హర్షవర్ధన్ తో కలిసి వాజిర్ పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు.
అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన పుష్కర్ సింగ్ ధామీ ఢిల్లీ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అవినీతిని రూపుమాపుతామని అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ ... అవినీతిని మరింత పెంచిందని పుష్కర్ సింగ్ ధామీ ఆరోపించారు.