- కమర్షియల్ గ్యాస్ సప్లై బంద్తో డొమెస్టిక్ కు డిమాండ్
- కొత్తగూడెంలోని ఓ రెస్టారెంట్ కు నిరంతరంగా సిలిండర్ల సప్లై
- ఒక్కో సిలిండర్ బండపై అదనంగా రూ.500నుంచి రూ.1000 వసూలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కమర్షియల్ సిలిండర్ల సప్లై బంద్ కావడంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. జిల్లాలోని పలు హోటళ్లు డొమెస్టిక్ సిలిండర్లు బ్లాక్లో తెప్పించుకుంటున్నారు. దీంతో డెలివరీ బాయ్స్సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్తక్కువగా ఉపయోగించే వినియోగదారుల నుంచి సిలిండర్లు బుక్ చేయించి పర్సంటేజీలు ఇస్తూ బ్లాక్ దందాకు పాల్పడుతున్నారు. ఒక్కో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.960 కాగా, హోటల్స్, రెస్టారెంట్స్లకు రూ.1,500 నుంచి రూ.2వేలకు చొప్పున అమ్ముతున్నారు.
డెలివరీ బాయ్స్తో ఒప్పందాలు..
కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటల్స్, రెస్టారెంట్ల ఓనర్స్ గ్యాస్ డోర్ డెలివరీ బాయ్స్తో మాట్లాడుకుని డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డబుల్ సిలిండర్ల కనెక్షన్స్ ఉన్న వారు 98,868 మంది, సింగిల్ సిలిండర్లు ఉన్న వారు 2,41,175 మంది, దీపం కనెక్షన్స్ 53,405, సీఎస్ఆర్ కనెక్షన్స్ 2,465, పీఎంయూవై కనెక్షన్స్ 73,162 ఉన్నాయి. మొత్తం 26 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంతో గ్యాస్కు కొంత కొరత ఏర్పడింది. ఈ క్రమంలో గృహ అవసరాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లైని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో హోటల్ యాజమాన్యాలు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ల వైపు దృష్టి సారించారు. సిలిండర్లను బ్లాక్ చేస్తుండడంతో ఇదే అదనుగా భావించిన డోర్ డెలివరీ బాయ్స్ డొమెస్టిక్ సిలిండర్లు కూడా దొరకడం లేదంటూ ప్రచారం చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్ల నుంచి డిమాండ్ ఉండడంతో ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల వినియోగదారులే దళారులుగా మారి హోటల్స్కు, రెస్టారెంట్లకు అధిక ధరలకు సిలిండర్లను అమ్ముతుండడం గమనార్హం. కాగా, కొత్తగూడెం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్కు అతి సమీపంలోని ఓ రెస్టారెంట్కు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిరంతరం సప్లై అవుతుండడం చర్చానీయాంశంగా మారింది.
సింగరేణిలో మరో విధంగా..
సింగరేణిలో ఏజెన్సీలతో కుమ్ముక్కైన డెలివరీ బాయ్స్ గ్యాస్ బ్లాక్ దందాకు తెరలేపారు. రిటైర్ అయిన కార్మికుల్లో ఎక్కువ మంది వద్ద గ్యాస్ సిలిండర్లుంటున్నాయి. ఇటువంటి వారిని గుర్తించిన డెలివరీ బాయ్స్ వారితో గ్యాస్ బుక్ చేయిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపల్కార్పొరేషన్ ఏరియాలో నివసిస్తున్న ఓ మాజీ సింగరేణి కార్మికుడికి తెలియకుండానే గ్యాస్ బుక్ అయింది. సబ్సిడీ తన ఖాతాలో పడడంతో ఆశ్చర్య పోయాడు. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఓ వ్యక్తికి గ్యాస్ బుక్ లేకున్నా డెలివరీ బాయ్ సిలిండర్ ఇచ్చారు. ఈ వినియోగదారుడి సెల్ నెంబర్కే ఓటీపీ వచ్చేలా ప్లాన్ చేసి మరీ ఇవ్వడం గమనార్హం.
హోటల్ బంద్ పెట్టినం..
కమర్షియల్ గ్యాస్ దొరకడం లేదు. నాలుగు రోజులుగా హోటల్ను బంద్ పెట్టినం. హోటల్ నడిస్తే మా కుటుంబంతో పాటు మరో ఆరు కుటుంబాలు బతుకుతాయి. పెద్ద హోటల్స్కు మాత్రం సిలండర్ల సప్లై ఎట్లా అవుతుందో అర్ధం కావడం లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సప్లై చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-ప్రకాశ్, చిరు హోటల్ వ్యాపారి, కొత్తగూడెం
బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..
డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ చేయడం, హోటల్స్, రెస్టారెంట్లకు అధిక ధరలకు అమ్మడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ల కొరత లేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హోటల్స్, రెస్టారెంట్లపై ఇప్పటికే దాడులు చేసి, డొమెస్టిక్ సిలిండర్లను గుర్తిస్తున్నాం. దాడులు నిరంతరం కొనసాగిస్తాం.
ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై ఆఫీసర్, భద్రాద్రికొత్తగూడెం
