ఉపాధి, ఆదాయం తెచ్చే ఇండస్ట్రీలు రాష్ట్రం దాటొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉపాధి, ఆదాయం తెచ్చే ఇండస్ట్రీలు రాష్ట్రం దాటొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • హుండయ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ కు సబ్ కమిటీ ఆమోదం 
  • 675 ఎకరాల్లో జహీరాబాద్ నిమ్జ్​లో రూ.8528 కోట్ల పెట్టుబడి
  • ప్రతి శనివారం ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశం 
  • ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రజా భవన్‌‌‌‌లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగిన ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కమిటీ సభ్యులు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. పారిశ్రామిక ప్రోత్సాహం, ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల అమలులో పురోగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఒక పరిశ్రమ స్థాపిస్తే దానికి అనుబంధంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్న ప్రతిపాదనలపై దృష్టి సారించి వాటిని త్వరితగతిన ఆచరణలోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఇకనుంచి ప్రతి శనివారం పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశాన్ని నిర్వహిద్దామని ఆయన అధికారులకు తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హుండాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌ను స్థాపించడానికి సబ్​ కమిటీ ఆమోదం తెలిపింది. 675 ఎకరాల్లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ రాష్ట్రానికి రావడం గొప్ప విజయంగా అభిప్రాయపడింది. ఈ పరిశోధనా, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుతో కొత్తగా 4,276 మంది రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు సమావేశంలో వివరించారు.

కొన్నేండ్లనే పెద్ద సంఖ్యలో ఉపాధి, ఆదాయం

పరిశోధనా కేంద్రంలో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ లైన్, ప్రోటోటైపింగ్ ప్రధాన వ్యవస్థలు ఉంటాయని కంపెనీ ప్రతినిధులు సబ్ కమిటీకి వివరించారు. ప్రస్తుతం ప్రారంభించబోతున్న పరిశ్రమలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి, ఆదాయాన్ని రాష్ట్రానికి సమకూరుస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎంవో కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, పరిశ్రమల డైరెక్టర్ మల్సూర్, వాణిజ్య పన్నుల కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి, ట్రాన్స్‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.