ప్లే ఆఫ్స్కు దూరమైనా.. మార్ష్ ఇన్నింగ్స్తో లక్నోకు ఊరట.. గుజరాత్కు ఊహించని షాక్

ప్లే ఆఫ్స్కు దూరమైనా.. మార్ష్ ఇన్నింగ్స్తో లక్నోకు ఊరట.. గుజరాత్కు ఊహించని షాక్

అహ్మదాబాద్‌‌: ఐపీఎల్‌‌–18లో ప్లే ఆఫ్స్‌‌కు దూరమైన లక్నో సూపర్‌‌జెయింట్స్‌‌కు ఊరట విజయం లభించింది. మిచెల్‌‌ మార్ష్‌‌ (64 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 8 సిక్స్‌‌లతో 117), నికోలస్‌‌ పూరన్‌‌ (27 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 56 నాటౌట్‌‌) చెలరేగడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో లక్నో 33 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 235/2 స్కోరు చేసింది.

మార్‌‌క్రమ్‌‌ (36) ఫర్వాలేదనిపించాడు. తర్వాత గుజరాత్‌‌ 20 ఓవర్లలో 202/9 స్కోరు చేసింది. షారూక్‌‌ ఖాన్‌‌ (29 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 57) బ్యాట్‌‌ ఝుళిపించగా శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (35), బట్లర్‌‌ (33), రూథర్‌‌ఫోర్డ్‌‌ (38) పోరాడి ఫెయిలయ్యారు. మార్ష్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

దంచుడే.. దంచుడు

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన లక్నో టాప్‌‌ ఆర్డర్‌‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా స్లాగ్‌‌ ఓవర్లలో గుజరాత్‌‌ బౌలింగ్‌‌ను ఊచకోత కోసింది. ఓపెనర్‌‌ మార్‌‌క్రమ్‌‌ రెండు ఫోర్లతో టచ్‌‌లోకి రాగా, మార్ష్‌‌ సిక్స్‌‌తో గాడిలోపడ్డాడు. అయినప్పటికీ జీటీ బౌలర్లు మూడు, నాలుగు, ఐదు ఓవర్లలో 4, 7 , 5 రన్సే ఇచ్చి స్కోరును కట్టడి చేశారు. ఆరో ఓవర్‌‌లో మార్‌‌క్రమ్‌‌ రెండు సిక్స్‌‌లు కొట్టడంతో ఎల్‌‌ఎస్‌‌జీ 53/0 స్కోరుతో పవర్‌‌ప్లేను ముగించింది.

ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత మార్ష్‌‌ 4, 6, 6, 4, 6తో బ్యాట్‌‌ ఝుళిపించాడు. మధ్యలో మార్‌‌క్రమ్‌‌ బౌండ్రీ రాబట్టినా పదో ఓవర్‌‌లో సాయికిశోర్‌‌ (1/34)కు వికెట్‌‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌‌కు 91 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. పూరన్‌‌ సిక్స్‌‌తో ఖాతా తెరవగా, తర్వాతి నాలుగు ఓవర్లలో 44 రన్స్‌‌ రావడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో లక్నో 97/1 స్కోరు చేసింది. 33 బాల్స్‌‌లో ఫిప్టీ కొట్టిన మార్ష్‌‌ 11వ ఓవర్‌‌లో ఫోర్‌‌, రషీద్‌‌ ఖాన్‌‌  వేసిన 12వ ఓవర్‌‌లో వరుసగా 6, 4, 6, 4, 4తో 25 రన్స్‌‌ దంచాడు.

13వ ఓవర్‌‌లో ప్రసిధ్‌‌ నాలుగు రన్సే ఇచ్చినా తర్వాతి రెండు ఓవర్లలో పూరన్‌‌ 6, 4, 6 కొట్టాడు. దీంతో 15 ఓవర్లలో స్కోరు 160/1కి పెరిగింది. సిరాజ్ వేసిన 16వ ఓవర్‌‌లో ఇద్దరూ కలిసి 4, 4, 6, 4తో 20 రన్స్‌‌ రాబట్టారు. ఆ వెంటనే పూరన్‌‌ మరో ఫోర్‌‌తో 23 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేయగా.. మార్ష్‌‌ కూడా బౌండ్రీతో 56 బాల్స్‌‌లో సెంచరీ అందుకున్నాడు. 18వ ఓవర్‌‌లో రెండు సిక్స్‌‌లు కొట్టిన మార్ష్‌‌ను 19వ ఓవర్‌‌లో అర్షద్‌‌ ఖాన్‌‌ (1/36) ఔట్‌‌ చేశాడు. ఫలితంగా రెండో వికెట్‌‌కు 52 బాల్స్‌‌లో 121 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో పూరన్‌‌ సిక్స్‌‌, పంత్‌‌ (16 నాటౌట్‌‌) రెండు సిక్స్‌‌లు కొట్టాడు. చివరి ఐదు ఓవర్లలో 75 రన్స్‌‌ రావడంతో లక్నో భారీ టార్గెట్‌‌ను నిర్దేశించింది. 

చివర్లో చేతులెత్తేశారు..

ఛేజింగ్‌‌లో గుజరాత్‌‌కు మంచి ఆరంభమే దొరికినా.. చివర్లో చేతులెత్తేశారు. స్టార్టింగ్‌‌లో సాయి సుదర్శన్‌‌ (21) మెరుపు వేగంతో షాట్లు ఆడితే.. గిల్‌‌ అండగా నిలిచాడు. ఈ ఇద్దరు కలిసి 27 బాల్స్‌‌లోనే 46 రన్స్‌‌ జోడించారు. కానీ క్రీజులో కుదురుకున్న ఈ జోడీని 5వ ఓవర్‌‌లో సుదర్శన్‌‌ను ఔట్‌‌ చేసి ఓ రూర్కే (3/27) విడగొట్టాడు. ఆరో ఓవర్‌‌లో బట్లర్‌‌ 4, 6, 6, 4తో రెచ్చిపోవడంతో పవర్‌‌ప్లేలో జీటీ 67/1 స్కోరు చేసింది.

తర్వాత రెండు ఫోర్లు కొట్టిన గిల్‌‌ను 8వ ఓవర్‌‌లో అవేశ్‌‌ ఖాన్‌‌ (2/51) బోల్తా కొట్టించాడు. రెండో వికెట్‌‌కు 39 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. రూథర్‌‌ఫోర్డ్‌‌ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసినా.. పదో ఓవర్‌‌లో బట్లర్‌‌ ఔట్‌‌తో జీటీ 97/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో వచ్చిన షారూక్‌‌ ఫోర్‌‌తో ఖాతా తెరిచాడు. 12వ ఓవర్‌‌లో రూథర్‌‌ఫోర్డ్‌‌ రెండు సిక్స్‌‌లు బాదాడు. 14వ ఓవర్‌‌లో షారూక్‌‌ 4, 4, రూథర్‌‌ఫోర్డ్‌‌ 6తో 17 రన్స్‌‌ రాగా, 15వ ఓవర్‌‌లో ఇద్దరు కలిసి 6, 4, 6తో 19 రన్స్‌‌ దంచారు. స్కోరు 165/3కి పెరిగింది. 16వ ఓవర్‌‌లో షారూక్‌‌ వరుసగా 4, 6, 4 బాదడంతో 17 రన్స్‌‌ వచ్చాయి.

ఇక విజయానికి 24 బాల్స్‌‌లో 54 రన్స్‌‌ అవసరమైన దశలో జీటీకి 17వ ఓవర్‌‌లో ఓ రూర్కే డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. ఆరు బాల్స్‌‌ తేడాలో రూథర్‌‌ఫోర్డ్‌‌, తెవాటియా (2)ను ఔట్‌‌చేశాడు. నాలుగో వికెట్‌‌కు 86 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగియగా, 22 బాల్స్‌‌లో షారూక్‌‌ ఫిఫ్టీ పూర్తి చేశాడు. 18వ ఓవర్‌‌లో అర్షద్‌‌ ఖాన్‌‌ (1), తర్వాతి ఓవర్‌‌లో షారూక్‌‌, లాస్ట్‌‌ ఓవర్‌‌లో బదోనీ (2/4).. రబాడ (2), సాయి కిశోర్‌‌ (1)ను వెనక్కి పంపడంతో జీటీ టార్గెట్‌‌ను అందుకోలేకపోయింది.  

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 235/2 (మిచెల్‌‌ మార్ష్‌‌ 117, పూరన్‌‌ 56, సాయి కిశోర్‌‌ 1/34).

గుజరాత్‌‌: 20 ఓవర్లలో 202/9 (షారూక్‌‌ 57, రూథర్‌‌ఫోర్డ్‌‌ 38, ఓ రూర్కే 3/27)