మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేసిన.. అభివృద్ధి పనులు ఏడియాడనే

మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేసిన..  అభివృద్ధి పనులు ఏడియాడనే

మహబూబ్​నగర్​, వెలుగు: మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు ముందు పడ్తలేవు. నిరుడు జూన్​లో ఆయన పాలమూరు జిల్లాలో పర్యటించి పేరూరు లిఫ్ట్​ స్కీం, వర్నె-ముత్యాలంపల్లి బ్రిడ్జి నిర్మాణం, బీటీ రోడ్డు, గుడిబండ నుంచి హైవే వరకు బీటీ రోడ్డు, పోతులమడుగు వద్ద మినీ స్టేడియం, భూత్పూర్​ మున్సిపాటీలో వెజ్, నాన్​ వెజ్​ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఈ పనుల్లో ఒక్కటీ పూర్తి కాలేదు. 30 శాతం పనులు కూడా కంప్లీట్ కాకపోగా, కొన్నింటికి పునాదులు తీసి వదిలేశారు. 

పేపర్ల మీదనే పేరూరు స్కీం..

దేవరకద్ర నియోజకవర్గంలోని 2,500 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రామన్​పాడు బ్యాక్​ వాటర్​ ఆధారంగా పేరూరు స్కీంకు డిజైన్​ చేశారు. ఈ స్కీంకు మంత్రి కేటీఆర్​ తుపాకులగుట్ట వద్ద జూన్​ 4న కొబ్బరికాయ కొట్టారు. కానీ, ఇంత వరకు 20 శాతం పనులు కూడా జరగలేదు. రూ.51 కోట్లతో స్కీంను పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.31 కోట్లకు సంబంధించిన పనులకు మాత్రమే అగ్రిమెంట్​ చేశారు. రామన్​పాడు నుంచి తుపాకుల గుట్ట వరకు 9.6 కిలోమీటర్ల మేర పైపులైన్​ పనులు చేయాల్సి ఉండగా, ఐదు నెలల కింద కొన్ని చోట్ల మాత్రమే పైపులైన్​ కోసం తవ్వి  వదిలేశారు. అప్పటి నుంచి ఈ పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. రూల్​ప్రకారం ఏడాదిలోపు ఈ స్కీంను వినియోగంలోకి తీసుకురావాల్సి ఉండగా, ఏడాది పూర్తి కావస్తున్నా పనులు ముందుకు పడ్తలేవు.

అన్ని పనులు ఇన్​ కంప్లీట్..​

అడ్డాకుల మండలంలోని ఊకచెట్టువాగుపై వర్నె-ముత్యాలంపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2016లో మొదటి సారి ప్రపోజల్స్​ పంపగా, 2021లో అడ్మినిస్ర్టేటివ్​ శాంక్షన్​ ఇచ్చారు. 320 మీటర్ల బ్రిడ్జి, నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు వేయాల్సి ఉంది. ఇందుకు గాను రూ.18 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.9 కోట్లు బ్రిడ్జికి, రూ.9 కోట్లు రోడ్డుకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పనులకు జూన్​ 4న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా, టెండర్లు ఆలస్యం కావడంతో నాలుగు నెలల తర్వాత పనులు మొదలు పెట్టారు. బ్రిడ్జికి సంబంధించి ర్యాప్ట్​ 150 మీటర్లకు గాను వంద మీటర్ల పని పూర్తి చేశారు. 15 స్లాబ్​లకు గాను మూడు స్లాబ్​లు కంప్లీట్​ అయ్యాయి. లింక్​ రోడ్డు పనులకు టెండర్లు పిలువ లేదు. మరో నెలలో వర్షాలు ప్రారంభం కానుండడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరదలు వస్తే చేసిన పనులు కొట్టుకుపోతాయని చెబుతున్నారు. అలాగే గుడిబండ నుంచి హైవే వరకు బీటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. 3 నెలల కింద పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​ 20 ఎంఎం కంకర పోసి వదిలేశారు. డస్ట్​, కంకర​వేసి రోల్​ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ పనులు ప్రారంభించలేదు. దీంతో దుమ్ము లేస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

పునాదులు దాటని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్

భూత్పూర్​ మున్సిపాల్టీలో రూ.2 కోట్లతో వెజ్, నాన్​ వెజ్​ మార్కెట్​ నిర్మాణానికి కర్వెన రూట్​లో ఉన్న స్థలంలో మంత్రి కేటీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ భూమి ఎండోమెండ్​కు చెందినది కావడంతో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్​ లీడర్లు మరుసటి రోజు శిలాఫలకాన్ని తీసేశారు. ఆ తర్వాత భూత్పూర్​ సమీపంలోని సర్వే నంబర్​ 392లోని ప్రభుత్వ భూమి గుర్తించి, మార్కెట్​కు కేటాయించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​ పునాదులు వరకు వేసి వదిలేశారు. అప్పటి నుంచి పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. అలాగే పోతులమడుగు శివారులో మినీ స్టేడియంకు శంకుస్థాపన చేయగా, అక్కడా పనులు పూర్తి కాలేదు.

డిజైన్​ మారుస్తున్నాం..

పేరూరు డిజైన్​ ప్రకారం రామన్​పాడు బ్యాక్​ వాటర్​ ఆధారంగా కొత్తపల్లి వద్ద పంపుహౌస్​ నిర్మించాల్సి ఉంది. అక్కడి నుంచి పైపులైన్​ ద్వారా స్కీం కింద ఆయకట్టుకు నీళ్లు అందించాల్సి ఉంది. అయితే, పంపుహౌస్​ డిజైన్​ను మార్చాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. కొత్త డిజైన్​  రూపొందిస్తున్నాం.

- జగన్​మోహన్​రెడ్డి, ఇరిగేషన్​ ఈఈ​