డీజీపీకి టికెట్ దక్కలె.. కానిస్టేబుల్కు కలిసొచ్చింది
చివరి నిమిషంలో చేతులెత్తేసిన అధికార పార్టీ
బీహార్ ఎలక్షన్స్.. పొత్తులో వేరే పార్టీకి దక్కిన సీటు
పాట్నా(బీహార్): ఆయనో డీజీపీ.. ఎలక్షన్ల నిలబడాలని ఉద్యోగానికి రాజీనామా చేసిండు. పార్టీ కండువా కూడా కప్పుకున్నడు, అన్నీ రెడీ చేసుకున్నడు. తీరా చూస్తే పార్టీ ప్రకటించిన కేండిడేట్ల లిస్ట్లో ఆయన పేరు లేదు. అదే నియోజకవర్గం టికెట్ను వేరే పార్టీ నుంచి ఓ కానిస్టేబుల్ దక్కించుకున్నడు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఘటన వివరాలు.. బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే నెల క్రితం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నడు. ఎన్నికల్లో నిలబడేందుకు జేడీయూ చీఫ్ నితీశ్ను కలిసి పార్టీలో చేరిండు. తన సొంతూరు బక్సర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పడంతో టికెట్ ఇవ్వడానికి నితీశ్కూడా ఓకే అన్నరు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది, ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. బీహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. సీట్ల పంపకాల్లో సదరు బక్సర్ సీటు కాస్తా బీజేపీకి వెళ్లింది. ఆ సీటును సర్దుబాటు చేయలేక, వేరే చోట టికెట్ ఇవ్వలేక జేడీయూ చేతులెత్తేసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చిన మాజీ డీజీపీ దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఇదిట్లుంటే.. అదే బక్సర్ సీటును దక్కించుకున్న బీజేపీ పరుశురామ్ చతుర్వేది అనే మాజీ కానిస్టేబుల్ను బరిలో దింపింది. దీంతో పాండే మరింత ఇరకాటంలో పడ్డారు. తెలిసినోళ్లు, తెలియనోళ్లు ఫోన్లు చేసి సానుభూతి చెప్పడం భరించలేకపోయారు. కొన్ని రోజులు నాకెవరూ ఫోన్ చేయకండ్రా బాబూ అని ఫేస్బుక్లో రిక్వెస్ట్ చేసిండు. టికెట్ రేసులో మాజీ డీజీపీని ఓడించిన మాజీ కానిస్టేబుల్ అంటూ బయ ట ప్రచారం జరుగుతుండగా.. మాజీ కానిస్టేబుల్ పరుశురామ్ చతుర్వేది మాత్రం పాండే సాబ్ నాకు పెద్దన్నలాంటోడు, ఆయనంటే నాకెప్పుడూ పూజ్యభావమే అంటూ తన అభిమానాన్ని చాటుకున్నడు.
For More News..