ధాబాల పరిస్థితి దారుణం.. కస్టమర్లు ఇంకా రావట్లే!

ధాబాల పరిస్థితి దారుణం.. కస్టమర్లు ఇంకా రావట్లే!
  • ధాబాల పరిస్థితి దారుణం
  • రోడ్ సైడ్‌‌‌‌ హోటళ్లకూ ఇంకా ఇబ్బందులే

న్యూఢిల్లీ: దేశ రాజధాని శివారులోని హైవే పక్కన ధాబా నడిపే అసిన్ శర్మ రోజూ తన కౌంటర్ దగ్గర ఖాళీగా కూచొని కనిపిస్తుంటారు. ఆయనను కదిలిస్తే కష్టాలన్నీ ఏకరవు పెట్టారు. చాలా నెలల నుంచే తన లాంటి చిన్న హోటళ్ల వాళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. ఎప్పుడో ఒకసారి కొద్దిమంది కస్టమర్లు వస్తుంటారని, వాళ్లు కూడా చాయ్, నీళ్లకు మించి ఏమీ ఆర్డర్ ఇవ్వడం లేదని వాపోయారు. తందూరీ రోటీలు చేయడానికి పెట్టిన పొయ్యిని వెలిగించడమే మానేశామని అన్నారు. "మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పని లేదు. ఖర్చులు మాత్రం తప్పడం లేదు. నౌకర్లుకు జీతాలు, కరెంటు, నీళ్ల బిల్లులకు డబ్బు పెట్టాల్సిందే. నా ఢాబా చావు అంచున ఉంది”అని 35 ఏళ్ల శర్మ నిరాశగా చెప్పారు. ధాబాలుగా పిలిచే రోడ్ సైడ్ హోటళ్ల ద్వారా మనదేశంలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు.  అయితే దాదాపు అన్ని హైవేలపై వెహికల్స్ తగ్గడంతో మనుగడ కోసం  ఇవి కష్టపడుతున్నాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా రూల్స్‌‌‌‌ను సడలించినప్పటికీ కస్టమర్లు ధాబాల్లో తినడానికి జంకుతున్నారు. సాధారణంగా ధాబాలను కుటుంబ సభ్యులంతా కలిపి నడుపుతుంటారు. స్థానిక ప్రజలతో సహా లక్షలాది మందికి ఇవి ఉపాధి కల్పిస్తున్నాయి. వీరిలో వలస కార్మికుల సంఖ్యే ఎక్కువ. లాక్‌‌‌‌డౌన్ వల్ల మిగతా సెక్టార్లకంటే హోటల్, టూరిజం ఇండస్ట్రీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. చాలా చిన్న హోటళ్లు ఇది వరకే మూతబడ్డాయి. ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు మళ్లీ తక్కువ వేతనంతో కూడిన వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు. రెస్టారెంట్ రంగంలో ఇక ముందు కూడా భారీ ఉద్యోగ నష్టాలు ఇక నుంచి కూడా ఉండొచ్చని,  థర్డ్ వేవ్ వస్తే కష్టాలు రెట్టింపు అవుతాయని ఎక్స్‌‌‌‌పర్టులు చెబుతున్నారు. కాగా, దేశంలో నిరుద్యోగం రేటు మేలో 11.9 శాతానికి పెరిగింది.

ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌పై ఆశలు లేవు...
మనదేశంలో  శనివారం కొత్తగా 60,753 కరోనా కేసులు రికార్డయ్యాయి. గత నెల తొమ్మిదిన రిజిస్టర్ అయిన నాలుగు లక్షల కేసులతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. వ్యాక్సిన్‌‌‌‌లు చాలా తక్కువ మందికి వేశారు కాబట్టి థర్డ్ వేవ్ రాదని చెప్పలేమని హెల్త్ ఎక్స్‌‌‌‌పర్టులు అంటున్నారు. ప్రభుత్వం, ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీని విపరీతంగా పెంచి, అందరికీ టీకాలు ఇచ్చినా ఎకానమీ ఇప్పటికిప్పుడు పుంజుకోవడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హోటల్ ఇండస్ట్రీకి కష్టాలు కొనసాగవచ్చన్నదే వారి అంచనా. కరోనా వల్ల నష్టాలు రావడంతో గత సంవత్సరం హోటల్స్ వంటి చిన్న ఇండస్ట్రీలకు లోన్లు, కిస్తీల చెల్లింపులపై ప్రభుత్వం మారటోరియం ఇచ్చింది. అయినా ఫలితాలు రాలేదు. ఈ లోన్లను తిరిగి చెల్లించాలంటూ ఇప్పటికే బ్యాంకుల నుండి నోటీసులు వచ్చాయి. మారటోరియం ముగిశాక అంటే..మార్చి తరువాత కూడా హోటల్ వ్యాపారులు కిస్తీలను చెల్లించలేకపోతున్నారు. బిజినెస్‌‌‌‌లో విపరీతంగా నష్టాలు వస్తున్నాయని, మూసివేతకు రెడీ అవుతున్న సమయంలో కిస్తీలు ఎలా కడతామని ఓనర్లు వాపోతున్నారు.   రెస్టారెంట్లను ఆదుకోవడానికి మరిన్ని చర్యలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫీసర్ ఒకరు చెప్పారు.  ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే హోటళ్లు, ధాబాలు బతకడం అసాధ్యమని చాలా మంది రెస్టారెంట్ యజమానులు స్పష్టం చేశారు. ‘‘థర్డ్ వేవ్ కూడా వస్తే బ్యాంకు కిస్తీల చెల్లింపు అసాధ్యంగా మారుతుంది. ఏవైనా ఆస్తులుంటే అమ్ముకొని అప్పులు కట్టాలి. మేం ఇప్పటికే చాలా మంది పనోళ్లను తీసేశాం. కొందరు కార్మికులను సొంతూళ్లకు పంపించాం” అని  మన్నత్ హవేలి రెస్టారెంట్ మేనేజర్ సోను శర్మ  చెప్పారు. ఈ రెస్టారెంట్ ఒకప్పుడు చాలా బిజీగా ఉండేది.  300 మంది పనిచేసేవారు. ఇప్పుడు కేవలం సగం మందితో నడిపిస్తున్నారు.   ఢిల్లీ–ముంబై హైవేపై కనిపించే హన్స్ రెస్టారెంట్ ది కూడా ఇదే పరిస్థితి. కరోనాకు ముందు కేటరింగ్ ఆర్డర్లు విపరీతంగా వచ్చేవి. పార్టీలు జరిగేవి. ఇప్పుడు కస్టమర్లు రాకపోవడంతో ‘టేకవే’ వ్యాపారంతో సరిపెట్టుకుంటున్నామని మేనేజర్ కైలాష్ చంద్ మేఘవాల్ అన్నారు. "ఇలాంటి రోజు చూస్తామని మేం ఎప్పుడూ అనుకోలేదు. మా సిబ్బందిలో దాదాపు 80శాతం మంది వాళ్ల ఊళ్లకు తిరిగి వెళ్ళారు” అని ఆయన వివరించారు.