
మిస్టర్ కూల్ ధోనీ మరోసారి అభిమానుల మనసును గెలుచుకున్నాడు. క్రికెట్ తో రికార్డులు బ్రేక్ చేసిన ధోనీ..ఇప్పుడు దేశభక్తిని చాటుతూ అందరిచేత ప్రశంసలు పొందుతున్నాడు. ధోనీ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ గా చేరిన విషయం తెలిసిందే. అయితే .. . ప్రస్తుతం కశ్మీర్ లో అత్యంత ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లలో మార్పులు చేయవచ్చనే ప్రచారం జోరందుకున్న క్రమంలో లోయ మొత్తం నివురు గప్పిన నిప్పులా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత భద్రత మధ్య కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులను ఇక్కడకు రావద్దని హెచ్చరికలు ఉన్నాయి. ధోనీ మాత్రం ధైర్యంగా విధుల్లో చేరాడు.
ఎటువంటి మినహాయింపులు లేకుండా తన ర్యాంక్ అధికారులు నిర్వహించే విధులనే ఆయన కూడా నిర్వహిస్తున్నాడు. ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉంది. దీంతో ఆయనకు స్పెషల్ రూమ్ కేటాయిస్తారు. కానీ.. ధోనీ ఆ ఏర్పాట్లను నిరాకరిస్తూ సైన్యానికి లెటర్ రాశాడు. తన కోసం ఎటువంటి స్పెషల్ ఏర్పాట్లను కోరలేదు. అందరిలాగే ఉదయం 5 గంటలకు నిద్రలేచి దినచర్యను ప్రారంభిస్తున్నాడు. సాధారణ జవాన్లతోపాటే కలిసి భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం 106 టీఏ పార బెటాలియన్లో ఆగస్టు 15 వరకు ధోనీ విధులు నిర్వహించనున్నాడు. ఈ క్రమంలో ఆయన సమీప గ్రామాల్లో కూడా గస్తీ నిర్వహించే అవకాశం ఉంది. కశ్మీర్ లోయలోని గ్రామాలు ఉగ్రవాదులకు అడ్డాలని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత దట్టమైన అడవుల మధ్య ఉండే అందమైన గ్రామాల్లో ఉగ్రవాదులు తోడేళ్ల వలే నక్కి ఉంటారు.
భారీ కాన్వాయ్ లో వెళ్తున్న CRPF దళాలపై దాడిచేసిన చరిత్ర ఇక్కడి ఉగ్రవాదులకు ఉన్న విషయం తెలిసిందే. గ్రామాల్లో పెట్రోలింగ్ ఎంత ప్రమాదకరమో అంచనా వేసుకోవచ్చు. సైన్యానికి చెందిన రెండు స్పెషల్ ఫోర్సు బెటాలియన్లు కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నాయి. వాస్తవాధీన రేఖను కాపాడటం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పాల్గొనడం వీటి విధి. ఈ క్రమంలోనే ధోనీ సాధారణ గార్డ్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రాణాలకు తెగించి ధోనీ ధైర్యంగా డ్యూటీ చేస్తుండటంతో మిస్టర్ కూల్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ధోనీ నీ దేశ భక్తికి హ్యాట్సాఫ్ అంటున్నారు.