
న్యూఢిల్లీ: ఇండియా మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిల–తానీషా క్రాస్టో జోడీ.. అర్కిటిక్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మిక్స్డ్ ప్రిక్వార్టర్స్లో ధ్రువ్–క్రాస్టో 23–25, 21–14, 21–17తో ఒల్కెసి టిటోవ్–యెవ్హెనియా కాంటెమిర్ (ఉక్రెయిన్)పై గెలిచారు. 54 నిమిషాల మ్యాచ్లో తొలి గేమ్లో ఓడిన ఇండియన్ జోడీ తర్వాతి రెండు గేమ్ల్లో జోరు చూపెట్టింది.
బలమైన స్మాష్లు, ర్యాలీలు, క్రాస్ కోర్టు విన్నర్లతో వరుసగా పాయింట్లు సాధించింది. ఫలితంగా స్పష్టమైన ఆధిక్యంతో ప్రత్యర్థులను చిత్తు చేసింది. విమెన్స్ సింగిల్స్లో తన్యా హేమంత్ 9–21, 8–21తో రెండో సీడ్ రచ్చనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. మెన్స్ సింగిల్స్లో తరుణ్ 20–22, 12–21తో కొకి వాటనాబే (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు.