
వాషింగ్టన్: చావు భ్రాంతి మాత్రమే అని, ఆత్మకు చావు ఉండదని ఓ మహిళ తెలిపింది. అమెరికాలోని కొలరాడోకు చెందిన 33 ఏండ్ల బ్రయానా లాఫర్టీ 8 నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని పొందింది. ఆ సమయంలో తాను పొందిన అనుభవాలను ఆమె వివరించింది. మైక్లోనస్ డైస్టోనియా (ఇదొక ప్రాణాంతకమైన న్యూరలాజికల్ వ్యాధి) తో బాధపడుతున్న బ్రయానా 8 నిమిషాల పాటు మెడికల్ గా చనిపోయింది. తాను చనిపోయాక అంతా చీకటిగా కనిపించిందని, కొంచెం సేపయ్యాక తాను మరో లోకంలోకి ప్రవేశించానని తెలిపింది.
‘‘నేను క్లినికల్ గా చనిపోయినట్లు డాక్టర్లు డిక్లేర్ చేసినట్లు నాకు గుర్తుంది. కానీ, నేను మాత్రం స్పృహలోనే ఉన్నట్లు అనిపించింది. నా ఫిజికల్ బాడీ నుంచి నన్ను వేరుచేసినట్లు అనిపించింది. అయినప్పటికీ నేను బతికే ఉన్నానన్న అనుభూతి కలిగింది. చనిపోయేటపుడు నాకు ఎలాంటి నొప్పి, బాధ కలగలేదు. బదులుగా ఎంతో మన:శాంతి కలిగింది. దేహం నుంచి వేరుపడ్డాక నా శరీరంపై నుంచి ఆత్మ ఎగురుతూ వెళ్లిపోయింది. తర్వాత నేను మరో ప్రపంచంలోకి ప్రవేశించాను. అక్కడ మనుషులు కాని జీవులను కలిశాను” అని బ్రయానా వివరించింది.
చనిపోయాక ఏమవుతుంది?
చనిపోయిన తర్వాత ఏమవుతుందనే విషయంపై సైంటిస్టులు కొన్నేండ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. నియర్ డెత్ ఎక్స్ పీరియెన్సెస్ గురించి తెలుసుకోవడం కష్టమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, మరణం అంచులో ఉన్నపుడు మన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ మెదడు ఒక్కసారిగా రీక్యాప్ చేసుకుంటుందని తెలిపారు. ఆ సంఘటలన్నీ ఒక మెరుపులా మన కండ్ల ముందు కనిపిస్తాయని కెనడాలోని కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.