- ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో కీలక మలుపు
- అరోరాను సాక్షిగా పరిగణించాలని సీబీఐ పిటిషన్
- 14న విచారణ జరపనున్న ప్రత్యేక కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అనుచరుడు దినేశ్ అరోరా అప్రూవర్గా మారేందుకు సిద్ధమైనట్లు స్పెషల్ కోర్టుకు సీబీఐ తెలిపింది. దినేశ్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈనెల 14కు వాయిదా వేస్తూ స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో అతడిని అప్రూవర్గా మారేందుకు అనుమతించాలా లేదా, పార్డన్(క్షమాభిక్ష) ఇవ్వాలా లేదా, సాక్షిగా పరిగణించాలా లేదా అనే దానిపై వాదనలు వింటామని స్పష్టం చేశారు. అంతకుముందు విచారణ సందర్భంగా.. కేసు గురించిన నిజాలను స్వచ్ఛందంగా చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు అరోరా చెప్పాడు. తాను అప్రూవర్గా మారడానికి సిద్ధంగా ఉన్నానని, తనపై ఎవరూ ఒత్తిడి చేయడం కానీ, బెదిరించడం కానీ చేయలేదని తెలిపాడు.
స్టేట్మెంట్ రికార్డ్
సెక్షన్ 164 (మేజిస్ట్రేట్ ముందు నేరాంగీకార ప్రకటన) కింద అరోరా స్టేట్మెంట్ను సీబీఐ ఇప్పటికే రికార్డు చేసింది. 14న విచారణ సందర్భంగా కోర్టు ముందు అతని స్టేట్మెంట్ను కూడా నమోదు చేసే అవకాశం ఉంది. కేసు విచారణను రహస్యంగా నిర్వహించాలని కోరుతూ అరోరా తరఫు లాయర్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, మీడియాను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని కోరారు. దీనిపై సీబీఐ కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అంతకుముందు అరోరాకు ముందస్తు బెయిల్ కూడా కోర్టు మంజూరు చేసింది. రాధా ఇండస్ట్రీస్కు చెందిన దినేశ్ అరోరా.. ఇండో స్పిరిట్స్ (లిక్కర్ తయారీ సంస్థ)కు చెందిన సమీర్ మహేంద్రు నుంచి రూ.కోటిని లంచంగా తీసుకున్నాడని సీబీఐ ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. సిసోడియా తరఫున అరోరా ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులో 15 మందిపై కేసు నమోదు చేసిన సీబీఐ.. అరోరా సహా పలువురు నిందితులకు చెందిన ప్రాపర్టీస్లో సోదాలు చేసింది. దాదాపు 8 సార్లు
అతడిని ప్రశ్నించింది.