మధ్యప్రదేశ్​లో అతిపెద్ద డైనోసార్ గుడ్లు

మధ్యప్రదేశ్​లో అతిపెద్ద  డైనోసార్ గుడ్లు
  •     256 భారీ సైజు ఎగ్స్ స్వాధీనం
  •     ఇప్పటిదాకా ఎక్కడా ఇన్ని దొరకలేదంటున్న సైంటిస్టులు

భోపాల్: మధ్యప్రదేశ్​లోని ధార్ జిల్లాలో అతిపెద్ద డైనోసార్లు జీవించినట్టు ఇండియన్ సైంటిస్టులు చెబుతున్నారు. మొత్తం 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజు టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్​ గుడ్లను కూడా కనుగొన్నారు. ఇప్పటి దాకా ఇంత భారీ స్థాయిలో ఎగ్స్​ ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని సైంటిస్టులు అంటున్నారు. వీటిలో చాలా అరుదైన ఫాజిల్ ఇన్​ ఫాజిల్​ ఎగ్స్​ కూడా ఉన్నట్టు తెలిపారు. నర్మదా వ్యాలీలో డైనోసార్​ జాతులు, అక్కడి వాతావరణంపై సమాచారం సేకరించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడ్తాయని అంటున్నారు. ధార్ జిల్లాలోని బాగ్ – కుక్షి ప్రాంతాల్లో సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. అఖాడా, ధోలియా రాయ్ పురియా, ఝబా, జమ్నియాపూరా, పడ్లియా గ్రామాల్లో ఎక్కువ గుడ్లు బయటపడ్డాయని జర్నల్ ప్లోస్ వన్​లో దీనికి సంబంధించిన న్యూస్​పబ్లిష్ అయ్యింది. ఈ ప్రాంతం సెంట్రల్ ఇండియా అప్పర్ నర్మదా లోయలోని జబల్​పూర్ (మధ్యప్రదేశ్), వెస్ట్రన్ సెంట్రల్ ఇండియాలోని లోయర్​ నర్మదా లోయ, పశ్చిమాన ఉన్న బాలాసినోర్ (గుజరాత్) మధ్య ఉంది. 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం.. 250 కంటే ఎక్కువ టైటానోసార్​ ఎగ్స్​తో పాటు హేచరీస్​ను కనుగొన్నదని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్​ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది.

1928లో ఫస్ట్​ టైం గుర్తింపు

టైటానోసార్ ​సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్‌‌లు ఇప్పటివరకు భూమిపై నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి. ఇవి పొడవైన మెడ, తోక, చిన్న తల, స్తంభాల్లాంటి నాలుగు కాళ్లు కలిగి ఉంటాయి. ఈ ప్రాంతంలో ఫస్ట్​ డైనోసార్ అవశేషాలను 1928లో జబల్‌‌పూర్ దగ్గర్లో కెప్టెన్ స్లీమన్ గుర్తించారు. అప్పటి నుంచి ఈ ఏరియాలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, రాహియోలిసారస్ గుజరాటెన్సిస్, ఇండోసుచస్ రాప్టోరియస్, ఇండోసారస్ మాట్లేయి, లేవిసుచస్ ఇండికస్, జైనోసారస్ సీఎఫ్​ వంటి డైనోసార్ జాతులున్నాయి. సెప్టెంట్రియోనాలిస్, ఇసిసారస్ కోల్బెర్టి, టైటానోసౌరిఫార్మ్స్ ఇండెట్, టైటానోసార్లలో తొమ్మిది ఓస్పెసీలు ఉన్నాయని స్టడీలో తేలింది. ఇండియన్​ సబ్ కాంటినెంటల్​లో నివసించిన టైటానోసార్​ ఎగ్స్ వేరే ప్రాంతాలతో పోలిస్తే డిఫెరెంట్​గా ఉన్నట్టు గుర్తించారు. పక్షుల మాదిరి గుడ్డు పెట్టే లక్షణానికి అనుగుణంగా ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. తాబేళ్లు, బల్లుల మాదిరిగానే డైనోసార్లకు పునరుత్పత్తి వ్యవస్థ ఉందా అనే దానిపై పరిశోధనలు చేయడానికి ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు. కొన్ని మిలియన్ ఏండ్ల కింద ఇవి ఇండియన్ భూభాగంలో సంచరిస్తుండేవి. ఈ డైనోసార్ల శిలాజాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలో కూడా బయటపడ్డాయి.