మహారాష్ట్ర తీరానికి పాకిస్తాన్‌‌ బోటు.. రాయ్‌‌గఢ్‌‌ తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం

మహారాష్ట్ర తీరానికి పాకిస్తాన్‌‌ బోటు..  రాయ్‌‌గఢ్‌‌ తీర ప్రాంతంలో  భద్రత కట్టుదిట్టం

అనుమానాస్పదంగా కనిపించడంతో హై అలర్ట్‌‌

ముంబై: మహారాష్ట్ర తీరానికి అనుమానాస్పద బోటు కొట్టుకువచ్చింది. రాయ్‌‌గఢ్‌‌ జిల్లాలోని రేవ్‌‌దండా తీర ప్రాంతానికి పాకిస్తాన్‌‌ గుర్తులు ఉన్న పడవ వచ్చిందని అధికారులు తెలిపారు. రాయ్‌‌గఢ్‌‌లోని కొర్లై తీరం నుంచి 2 నాటికల్‌‌ మైళ్ల దూరంలో పడవను గుర్తించగానే రాయ్‌‌గఢ్‌‌ పోలీసులు, బాంబ్‌‌స్క్వాడ్‌‌ బృందాలు, క్విక్‌‌ రెస్పాన్స్‌‌ టీమ్స్‌‌, నేవీ, కోస్ట్‌‌ గార్డ్‌‌ బృందాలు స్పాట్‌‌ కు చేరుకున్నాయి. 

అనుమానాస్పద పడవ నుంచి రెడ్‌‌ లైట్‌‌ వస్తున్నట్లు గుర్తించారు. అయితే, భారీ వర్షం కారణంగా పడవ ఉన్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. దీంతో తీర ప్రాంతాన్ని అలర్ట్‌‌ చేయడంతోపాటు రాయ్‌‌గఢ్‌‌ జిల్లావ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరైనా వచ్చి పడవ నుంచి అక్కడే దిగిపోయుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీరంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.