‘ది రాజా సాబ్’ చిత్రం ప్రేక్షకులకు నచ్చడం వల్లే బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తోందని అన్నారు దర్శకుడు మారుతి. ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు లభిస్తున్న స్పందన గురించి మారుతి మాట్లాడుతూ ‘మా సినిమా 4 రోజుల్లో రూ.200 కోట్ల మార్క్ టచ్ చేయడమంటే ప్రభాస్ గారిని కొత్త జానర్లో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినట్టే కదా. హ్యాపీ. బీ, సీ సెంటర్స్లో కూడా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఇక ప్రతి సినిమాకు సోషల్ మీడియాలో ట్రోల్స్ కామన్. ఏ సినిమా గురించి రాలేదో చెప్పండి. నలుగురు చెడుగా మాట్లాడితే నలభై మంది వెళ్లి సినిమా చూసి, బాగుంది కదా అంటున్నారు.
ప్రభాస్ గారిని కొత్తగా ప్రజెంట్ చేశానని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. సైకలాజికల్ ఎలిమెంట్స్తో కూడిన కొత్త పాయింట్ను టచ్ చేశాం కనుక రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ముందే ఊహించాం. ప్రభాస్ గారు కూడా ‘ప్రశాంతంగా ఉండు డార్లింగ్.. మనం కొత్త ప్రయత్నం చేశాం, ఆడియెన్స్కు చేరడానికి కొంత టైమ్ పడుతుంది’ అని చెప్పారు. సైకలాజికల్ సీన్స్ కొందరికి సులువుగా అర్థం కాకపోయి ఉండొచ్చు. ప్రభాస్ గారి లాంటి పాన్ ఇండియా స్టార్తో సాదాసీదా హారర్ కామెడీ చేయొద్దని ఇలా ఫాంటసీ, సైకలాజికల్ ఎలిమెంట్స్ జోడించి బిగ్ స్కేల్లో తీశాం.
ఒక వ్యక్తి ట్రాన్స్లోకి వెళ్లాడు అనేది విజువల్ గా చూపించడం కష్టం. అతని సబ్ కాన్షియస్ మైండ్ను కూడా తెరపై చూపించాలి. ఇలాంటి సినిమా చేయడం ఈజీ కాదు. క్లైమాక్స్లో వందమందితో ఫైట్ చేయించొచ్చు. అలా చేస్తే మళ్లీ రొటీన్ అంటారు. ఏదేమైనా నేనొక పెద్ద స్టార్తో కూడా సినిమా బాగా చేయగలనని ప్రూవ్ చేసుకున్నా. చాలా నేర్చుకున్నా. ఈ సినిమా నాకొక గుడ్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చింది’ అని చెప్పారు.
