ఒక కుటుంబం ఒకే టికెట్..కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

ఒక కుటుంబం ఒకే టికెట్..కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
  • లెక్కలు వేసుకుంటున్న కాంగ్రెస్​ రాష్ట్ర నేతలు
  • ఎవరి కుటుంబానికి రెండో టికెట్​ వస్తుందని ఆరా
  • ఉత్తమ్ దంపతులు, కోమటిరెడ్డి, మల్లు బ్రదర్స్​కు నో డౌట్​
  • జానారెడ్డి సేఫ్ జోన్.. అంజన్​, అనిల్ కు ఢోకా లేదు
  • డౌట్​లో జగ్గారెడ్డి, కొండా, బలరాం, సీతక్క కుటుంబాలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్​లో ‘ఉదయ్​పూర్​ డిక్లరేషన్’​ హాట్​ టాపిక్​గా మారింది. ముఖ్యంగా ‘ఒక కుటుంబం ఒకే టికెట్’ అంశంపై చర్చ జరుగుతున్నది. కొడుకులు, కూతుళ్లు, కుటుంబసభ్యులను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపాలనుకుంటున్న నేతలు ఎవరికి వారు తామెంత సేఫ్​ అన్నది లెక్కలేసుకుంటున్నారు. రెండో టికెట్​ ఆశిస్తున్న వాళ్లలో కొందరు ‘పార్టీలో ఐదేండ్ల పాటు క్రియాశీలంగా పని చేసి ఉండాలి’ అనే మినహాయింపు వల్ల రిలాక్స్​ అయ్యారు. 

మరికొందరు ‘క్రియాశీలం’ అనే దానికి కొలబద్దత ఏమిటని ఆరా తీస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్​లోకి జంప్​ చేయాలని ఆలోచన ఉన్న వాళ్లు ఈ నిబంధన తమకు అడ్డంకిగా మారుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నిజంగానే దీన్ని అమలు చేస్తారా? లేదా గతంలో చేసినట్లు మినహాయింపులు ఉంటాయా అని చర్చించుకుంటున్నారు. 

వీళ్లకు నో డౌట్​!

  • ఉదయ్​పూర్​లోని ‘చింతన్​ శిబిర్​’లో తీసుకున్న నిర్ణయం గట్టిగానే అమలు చేస్తారని కాంగ్రెస్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. డజనుకు పైగా నేతలు తమ వారసులను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటుండగా, మరికొందరు ఈ మధ్యనే నియోజక వర్గాల్లోని కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఐదేండ్ల నిబంధనతో తాము సేఫ్​ అని ఉత్తమ్​కుమార్​, కోమటిరెడ్డి, మల్లు బ్రదర్స్​, జానారెడ్డి, అంజన్​ కుమార్​లాంటి నేతలు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం డౌట్​లో ఉన్నారు. అందులో కొండా సురేఖ దంపతులు, జగ్గారెడ్డి, బలరాం నాయక్​, సీతక్కలాంటి నేతలున్నారు. వీళ్ల వారసులు నియోజకవర్గంలో పరిమితమైన కార్యకలాపాల్లో మాత్రం పాలుపంచుకున్నారు. క్రియాశీలమైన యాక్టివిటీలో లేనందున అధిష్టానం వీళ్లను పరిగణనలోకి తీసుకుంటుందో లేదో అనే సందేహంతో ఉన్నారు. 
  • పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​కుమార్​ కుమార్​ రెడ్డి, ఆయన భార్య పద్మావతి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్​నగర్​, కోదాడ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. 2018  ఎన్నికల్లో మళ్లీ ఇద్దరు అసెంబ్లీకి పోటీ చేసినప్పటికీ ఉత్తమ్​ గెలిచారు. పద్మావతి ఓడిపోయారు. తర్వాత జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఉత్తమ్​ నల్గొండ స్థానానికి పోటీ చేసి గెలిచారు. దాంతో ఖాళీ అయిన ఆయన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె రెండు నియోజక వర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీళ్లు తాము సేఫ్​ జోన్​లో ఉన్నట్లు భావిస్తున్నారు. 
  • కోమటిరెడ్డి బ్రదర్స్​లో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భువనగిరి లోక్​సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే, కోమటిరెడ్డి రాజ్​గోపాల్​ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. రాజ్​గోపాల్​ ప్రస్తుతం పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. ఆయన తన భార్య లక్ష్మిని చట్టసభకు పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీకి పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న రాజ్​గోపాల్​రెడ్డి  తన స్థానం ఖాళీ కావడంతో భార్య లక్ష్మితోనే పోటీ చేయించి ఓటమి పాలయ్యారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్​ పార్టీలో క్రియాశీలంగా ఉన్నప్పటికీ రాజ్​గోపాల్​ భార్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు. అంతేకాక ఒకే కుటుంబానికి మూడో టికెట్​దక్కే సీన్​ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. 
  •  కాంగ్రెస్​లో సీనియర్​ నేత జానారెడ్డి చాలా కాలంగా తన కుమారుడు రఘువీరా రెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని భావిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో తాను నాగార్జునసాగర్​ నుంచి పోటీ చేయాలని, కుమారుడ్ని మిర్యాలగూడ నుంచి పోటీ చేయించాలనుకున్నారు. అయితే అప్పుడు ‘ఒక కుటుంబం ఒక టికెట్’​ నిబంధన  ప్రచారంలోకి తెచ్చి ఆయన ఆశలను ఫలించనీయలేదు. కాగా నాగార్జునసాగర్​ నుంచి పోటీ చేసి జానారెడ్డి ఓడిపోయారు. అక్కడి నుంచి గెలిచిన నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో జానారెడ్డి పోటీ చేసేందుకు అంత ఆసక్తి చూపలేదు. తన కుమారుడ్ని బరిలోకి దింపాలనుకున్నారు. కానీ హైకమాండ్​ ఆదేశంతో ఆయనే పోటీ చేశారు. కానీ, ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ దఫా కుమారుడితో పోటీ చేయించాలనే పట్టుదలతో జానారెడ్డి ఉన్నారు. నాగార్జునసాగర్​ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకునే ముందు ఆయన హైకమాండ్​కు ఇదే కండీషన్​ పెట్టినట్లు అప్పట్లోనే చర్చ జరిగింది. రఘువీరారెడ్డి నియోజక వర్గంలోని సమావేశాలు, ఇతర కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ వస్తున్నారు.  
  • కాంగ్రెస్​ కార్యక్రమాల్లో మల్లు బ్రదర్స్​చురుగ్గా పాల్గొంటున్నారు. మల్లు రవి పీసీసీ సీనియర్​ఉపాధ్యక్షుడిగా, మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. దీంతో తమకు ఢోకా లేదని వారు భావిస్తున్నారు. కాగా, భట్టి తన భార్య నందినిని ఖమ్మం లోక్​సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనుకుంటున్నారనే ప్రచారం చాలా కాలంగా సాగుతున్నది.  
  • పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంజన్​ కుమార్​ యాదవ్​, ఆయన కుమారుడు, యూత్​ కాంగ్రెస్​ నేత అనిల్​ కుమార్​ యాదవ్​ పార్లమెంట్​కు ఒకరు, అసెంబ్లీకి ఒకరు పోటీ చేయాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనిల్​ ముషీరాబాద్​ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వీరిద్దరు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారే. 

వీళ్లకు డౌటే!

పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ సారి తన కూతురు విజయారెడ్డి లేదా భార్య నిర్మలను ఎన్నికల బరిలో దింపాలనే బలమైన కోరికతో ఉన్నారు. తాను సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, వీళ్లలో ఒకరిని మెదక్​ లోక్​సభ నియోజకవర్గానికి పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నారు. అయితే వీళ్లిద్దరూ నియోజకవర్గంలో కాంగ్రెస్​ నేతల మంచి చెడు చూసుకోవడం మినహా వాళ్లకు వాళ్లు కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి వరంగల్​ జిల్లా నేతలు కొండా దంపతులు 2 టికెట్లు ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు. గత ఎన్నికల్లోనే వీరు టికెట్​ఆశించి నిరాశకు గురయ్యారు. కొండా సురేఖ, ఆమె కూతురు సుష్మితా పటేల్​ పరకాల, తూర్పు వరంగల్​ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. ఫైర్​ బ్రాండ్​ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న సీతక్క తన కొడుకు సూర్యను ఖమ్మం జిల్లా పినపాక నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​ తాను మహబూబాబాద్​ ఎంపీగా,  తన కొడుకు సాయిశంకర్​ను అదేస్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలనే ఆశ పెట్టుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా తన భార్య పద్మినిని పార్లమెంట్​కు పోటీ చేయించాలని ఆశిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ విషయం అంతగా ప్రచారంలో లేదు. ఎల్బీ నగర్​, ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయాలని మల్​రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి సోదరులు భావిస్తున్నారు. మండలి మాజీ చైర్మన్​ షబ్బీర్​ అలీ కూడా తన వారసులను రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే.. జంట టికెట్లు ఆశిస్తున్న చాలా మంది నేతలు తమ వారసులను తమ వెంట పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్​ చేస్తున్నారు. కానీ, వాళ్లు నియోజకవర్గాల్లో చురుగ్గా ఉండట్లేదు. దీంతో వాళ్లకు టికెట్లు లభిస్తాయా లేదా అన్నది అనుమానం.