భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో శనివారం నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఐదో సదస్సులో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం మాత్రమే కాకుండా దేశ ప్రజల జీవన విధానాన్ని దిశా నిర్దేశం చేసే మహత్తర గ్రంథమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రాజ్యాంగం, న్యాయస్థానాల విధులు, చట్టాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. రాజ్యాంగ విలువల పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఐఎల్పీఏ తీయ అధ్యక్షురాలు కె. సుజాత, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత, న్యాయమూర్తులు కిరణ్ కుమార్, కవిత, రాజేందర్, సుచరిత, రవి కుమార్, వినయ్ కుమార్, సూరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఐఎల్పీఏ బాధ్యులు శాంసన్, దేవ రాజ్, లక్ష్మీదేవి, నాగేందర్, యెర్రా కామేశ్పాల్గొన్నారు.
