![దివీస్ ల్యాబ్స్ లాభం రూ.348 కోట్లు.. వార్షికంగా 29 శాతం తగ్గుదల](https://static.v6velugu.com/uploads/2023/11/divis-lab-q2-results_7RCJerwFjb.jpg)
న్యూఢిల్లీ : హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబ్స్ సెప్టెంబరు 2023తో ముగిసిన రెండో క్వార్టర్లో రూ.348 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సంపాదించింది. ఏడాది క్రితం రెండో క్వార్టర్లో వచ్చిన లాభం రూ. 493 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం తగ్గింది. ఎనలిస్టులు ఈసారి దివీస్కు రూ.424 కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం వార్షికంగా 3శాతం పెరిగి రూ.1,909 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.1,855 కోట్లు ఉంది. ఈ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ఇబిటా రూ. 479 కోట్లు కాగా, మార్జిన్లు 25.1శాతం వద్ద ఉన్నాయి.
పన్నుకు ముందు లాభం (పీబీటీ) రూ. 469 కోట్లు ఉండగా, గత సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన రూ. 615 కోట్ల పీబీటీతో పోలిస్తే 24శాతం తగ్గింది. మొత్తం ఆదాయం కూడా 3శాతం పెరిగి రూ. 1,995 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం సెప్టెంబరు -క్వార్టర్లో రూ. 1,935 కోట్లుగా ఉంది. కంపెనీ గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 31 కోట్ల ఫారెక్స్ లాభం పొందగా, ఈసారి రూ. 11 కోట్ల ఫారెక్స్ లాభాన్ని సాధించింది. సెప్టెంబరు 2023తో ముగిసిన అర్ధ సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) రూ. 3,854 కోట్లకు చేరింది. గత అర్ధ సంవత్సరంలో రూ. 4,278 కోట్ల ఆదాయం వచ్చింది.