
- టికెట్ బుకింగ్స్ భారీగా పెరిగాయన్న మేక్ మైట్రిప్, థామస్ కుక్, ఇగ్జిగో, క్లియర్ ట్రిప్
- ఫ్లైట్ బుకింగ్స్లో ఏడాది లెక్కన 65శాతం వృద్ధి
ముంబై: భారతదేశంలో దీపావళి ప్రయాణాలు రికార్డ్ లెవెల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. టికెట్ బుకింగ్స్ భారీగా జరిగాయని ట్రావెల్ కంపెనీలు పేర్కొన్నాయి. రిలేటివ్స్ను కలవడానికి, లగ్జరీ ట్రావెల్, ఆధ్యాత్మిక యాత్రలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపాయి. మేక్మైట్రిప్, థామస్ కుక్, ఇగ్జిగో, క్లియర్ట్రిప్ వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారాలు దేశీయ, అంతర్జాతీయ బుకింగ్స్లో భారీ వృద్ధిని నమోదు చేశాయి.
‘‘ట్రావెల్ బుకింగ్స్ పెరగడంలో విజిటింగ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ (వీఎఫ్ఆర్) కేటగిరీ ప్రధానంగా ఉంది. దీపావళి వారాంతానికి దగ్గరగా రావడంతో, ప్రజలు ముందుగానే ప్రయాణాలు బుక్ చేసుకుంటున్నారు. టాప్ 10 బుక్డ్ డెస్టినేషన్లలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. కుటుంబ కలయికతో పాటు పుణ్యక్షేత్రాలు సందర్శించాలనే ఆలోచన ప్రజల్లో పెరిగింది” అని మేక్మైట్రిప్ సీఈఓ రాజేష్ మాగో అన్నారు. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం టాప్ డెస్టినేషన్లుగా ఉన్నాయని తెలిపారు. థామస్ కుక్ ఇండియా అధికారి రాజీవ్ కేల్ మాట్లాడుతూ, చాలా కుటుంబాలు దీపావళిని కొత్త ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. 6–12 రోజుల ట్రావెల్ ప్లాన్ చేయడం వంటి ట్రెండ్ పెరుగుతోందన్నారు.
‘‘యూరప్లో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్పెయిన్, పోర్చుగల్ టాప్ ఫేవరెట్స్ కాగా, వియత్నాం, ఓమన్, మాల్దీవ్స్, బాలి, కంబోడియా వంటి ప్రదేశాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. వీసా- ఫ్రీ లేదా ఈజీ వీసా గల దేశాలకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. థాయ్లాండ్, మలేషియా, శ్రీలంక, నేపాల్, భూటన్, దుబాయ్– అబుదాబి, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్కు కూడా ట్రావెల్ బుకింగ్స్ భారీగాపెరిగాయి”అని వివరించారు.
దేశీయంగా ఇక్కడికి పోదాం
దేశీయంగా కేరళ, రాజస్థాన్, ఉత్తరఖాండ్, అండమాన్స్తో పాటు చార్ ధామ్, కైలాష్ మాన్సరోవర్, ఆయోద్య, వారణాసి వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ఇగ్జిగో సీఈ అలోక్ బజ్పాయి ప్రకారం, ఫ్లైట్ బుకింగ్స్లో ఏడాది లెక్కన 60–65శాతం వృద్ధి కనిపిస్తోంది. ఆయోద్యకు బుక్ చేసుకున్న టికెట్స్ 100శాతం పెరిగాయి.
ఢిల్లీ, ముంబై, చెన్నై కంటే ఇది ముందంజలో ఉంది. పాట్నా (46శాతం గ్రోత్), లక్నో (23శాతం గ్రోత్) వంటి హోమ్టౌన్లకు తిరిగి వెళ్లే ట్రెండ్ కూడా పెరిగింది. జైపూర్, గోవా, శ్రీనగర్ వంటి లీజర్ డెస్టినేషన్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ‘‘దీపావళి వారంతంలో వస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నవారు తమ లీవ్స్ను 5–6 రోజులు పొడిగించుకొని కుటుంబంతో దీపావళి జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
క్రూయిజ్ ప్రయాణాలు కూడా మిలినియల్స్, జెన్ జెడ్, ప్రొఫెషనల్స్ మధ్య పాపులర్ అవుతున్నాయి” అని ఎస్ఓటీసీ ట్రావెల్ అధికారి ఎస్డీ నందకుమార్ అన్నారు. 4, 5-స్టార్ హోటల్ బుకింగ్స్ భారీగా పెరిగాయని క్లియర్ట్రిప్ పేర్కొంది. కిందటి దీపావళితో పోలిస్తే ఈసారి 5-స్టార్ బుకింగ్స్ 2 రెట్లు, హోటల్ బుకింగ్స్ 3.5 రెట్లు, ఫ్లైట్ బుకింగ్స్ 2 రెట్లు, యూజర్ గ్రోత్ 2.2 రెట్లు పెరిగాయని వివరించింది.