
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వరుసగా నాలుగో రోజూ వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్ష సభ్యులు గురువారం అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో ఆందోళన చేశారు. బిహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. దీంతో సభ ప్రారంభమైన 7 నిమిషాల్లోనే వాయిదా పడింది. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో సభను ముందుగా మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మరునాటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించారు.