
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.23 వేల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చరింగ్ స్కీమ్కు అప్లయ్ చేసేందుకు దేశీయ కంపెనీలు ఎగబడుతున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం, డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఏక్వస్, సంవర్ధన మదర్సన్ వంటి పెద్ద కంపెనీలు ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చాయి. ఈ స్కీమ్కు దరఖాస్తు చేసిన కంపెనీలలో 90 శాతం భారతీయ సంస్థలే ఉన్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
దేశీయ కంపెనీల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని అన్నారు. ప్రభుత్వానికి ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. అంబర్ ఎంటర్ప్రైజెస్ రూ.4,200 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. రెండు ప్రాజెక్టుల కోసం దక్షిణ కొరియా సంస్థతో భాగస్వామ్యం అయ్యింది. డిక్సన్ టెక్నాలజీస్ రూ.4 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను సబ్మిట్ చేసింది. డిస్ప్లేలు, కెమెరా మాడ్యూల్స్, ఎన్క్లోజర్లు, లిథియం- అయాన్ సెల్స్, ఆప్టికల్ ట్రాన్సీవర్స్ను కంపెనీ తయారు చేయనుంది. ఇక ఎన్క్లోజర్ల విభాగంలో ఇప్పటివరకు సగటున రూ.2,238 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.