నాలుగో రోజూ నష్టాలే.. సెన్సెక్స్ 386 పాయింట్లు డౌన్, 112 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

నాలుగో రోజూ నష్టాలే.. సెన్సెక్స్ 386 పాయింట్లు డౌన్, 112 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

ముంబై: బ్యాంకింగ్​, ఆటో, క్యాపిటల్​ గూడ్స్​ షేర్లలో ప్రాఫిట్​ బుకింగ్, విదేశీ నిధుల వెనక్కి పోవడం, హెచ్​1బీ వీసా ఫీజులపై కొనసాగుతున్న ఆందోళనల కారణంగా బుధవారం బెంచ్​మార్క్​ స్టాక్​ ఇండెక్స్ సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజూ పడిపోయింది. ఈ ఇండెక్స్‌‌‌‌ 386.47 పాయింట్లు నష్టపోయి 81,715.63 వద్ద ముగిసింది. ట్రేడింగ్​లో ఒక దశలో ఇది 494.26 పాయింట్లు తగ్గి 81,607.84 కనిష్ట స్థాయిని తాకింది. 50-షేర్ల ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 112.60 పాయింట్లు తగ్గి 25,056.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్​ కంపెనీలలో టాటా మోటార్స్, భారత్​ ఎలక్ట్రానిక్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, టెక్​ మహీంద్రా, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​, యాక్సిస్​ బ్యాంక్​ భారీగా నష్టపోయాయి.  

పవర్​ గ్రిడ్​, హిందుస్థాన్​ యూనిలీవర్, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​ టెక్​ లాభపడ్డాయి. ఎఫ్​ఐఐలు మంగళవారం రూ. 3,551.19 కోట్లు విలువైన ఈక్విటీలను అమ్మారు.  "జీఎస్​టీ సంస్కరణల తర్వాత భారతీయ మార్కెట్లలో ప్రాఫిట్​ బుకింగ్​ కనిపించింది. ఇన్వెస్టర్లు వాల్యుయేషన్లను, మొదటి క్వార్టర్​ ఆదాయ అంచనాలను మళ్లీ అంచనా వేసుకుంటున్నారు. హెచ్​1బీ ఫీజు పెంపు కారణంగా ఐటీ స్టాక్స్ నష్టపోతున్నాయి.  బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి" అని జియోజిత్​ ఇన్వెస్ట్​మెంట్స్​ లిమిటెడ్​ రీసెర్చ్​ హెడ్​వినోద్​ నాయర్ అన్నారు. అధిక వాల్యుయేషన్లు, ఆదాయ వృద్ధిలో తగ్గుదల వల్ల 
ఎఫ్​ఐఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

సూచీల నేల చూపులు

బీఎస్​ఈ మిడ్​క్యాప్ సూచీ 0.85 శాతం, స్మాల్​క్యాప్​ సూచీ 0.50 శాతం తగ్గాయి. సెక్టోరల్​ సూచీలలో రియల్టీ అత్యధికంగా 2.47 శాతం పడిపోయింది. ఆ తర్వాత యుటిలిటీస్​ (1.19 శాతం), క్యాపిటల్​ గూడ్స్​ (1.09 శాతం), సర్వీసెస్​ (1.07 శాతం), పవర్​ (1.06 శాతం), ఆటో (1.06 శాతం), కన్స్యూమర్​ డిస్క్రెషనరీ (0.87 శాతం) నష్టాలపాలయ్యాయి. ఎఫ్​ఎంసీజీ ఒక్కటే లాభపడింది. నాలుగు రోజులలో సెన్సెక్స్​ 1.56 శాతం, నిఫ్టీ 1.44 శాతం పడిపోయాయి. 

ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ నష్టపోగా, జపాన్​ నిక్కీ 225 సూచీ, షాంఘై ఎస్​ఎస్​ఈ కాంపోజిట్​ సూచీ, హాంగ్​ కాంగ్​ హ్యాంగ్​ సెంగ్​ పాజిటివ్​గా ముగిశాయి. యూరప్ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం యూఎస్​ మార్కెట్లు నెగిటివ్​గా ముగిశాయి. ప్రపంచ చమురు బెంచ్​మార్క్​ బ్రెంట్​ క్రూడ్ 0.44 శాతం పెరిగి  67.93 డాలర్లకు చేరుకుంది.