12 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. మరో 7 దేశాల సిటిజన్స్‌‌‌‌పై ఆంక్షలు

12 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. మరో 7 దేశాల సిటిజన్స్‌‌‌‌పై ఆంక్షలు
  • అఫ్గాన్, మయన్మార్, తదితర దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధించిన ట్రంప్  
  • ఈ నెల 9 నుంచి అమల్లోకి ఉత్తర్వులు 
  •  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన యూఎస్ ప్రెసిడెంట్ 
  • ఒక్కరోజే 2,200 మంది అక్రమ ఇమిగ్రెంట్ల అరెస్టు

వాషింగ్టన్:12 దేశాల పౌరులపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆయా దేశాల సిటిజన్స్ అమెరికాలోకి రాకుండా నిషేధం విధించింది. మరో ఏడు దేశాలకు చెందిన పౌరులపైనా ఆంక్షలు పెట్టింది. ఇవి ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతకంటే ముందు జారీ అయ్యే వీసాలను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై సంతకం చేశారు. 

నిషేధిత దేశాల జాబితాలో అఫ్గానిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఉన్నాయి. ఇక ట్రావెల్ ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనిజువెలా ఉన్నాయి. 

మాకు హాని చేసేటోళ్లను రానియ్యం: ట్రంప్ 

ఫారిన్ టెర్రరిస్టుల నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడానికే ట్రావెల్ బ్యాన్ విధించానని ట్రంప్ తెలిపారు. అమెరికా భద్రత, ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. తమకు హాని చేయాలనే ఉద్దేశమున్నోళ్లను తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇప్పుడున్న దేశాల లిస్టును సవరించవచ్చని, వాటికి కొత్తవి కూడా జత కావొచ్చని పేర్కొన్నారు. బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో ట్రంప్ ఒక వీడియో పోస్టు చేశారు. 

ఇటీవల కొలరాడోలో ఇజ్రాయెల్‌‌‌‌ మద్దతుదారులపై జరిగిన సీసాబాంబు దాడి గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘అమెరికాకు వచ్చే పౌరులను పూర్తిస్థాయిలో తనిఖీ చేయడానికి కొన్ని దేశాలు సహకరించడం లేదు. అందుకే ఆ దేశాలపై బ్యాన్ విధించాం. సరైన తనిఖీలు లేకుండా మా దేశంలోకి ప్రవేశించిన వ్యక్తి.. ఇటీవల కొలరాడోలో దాడి చేశాడు. ఇలాంటి వారితో మాకు ముప్పు పొంచి ఉంది. అలాంటి వాళ్లు మాకు అక్కర్లేదు” అని వీడియోలో పేర్కొన్నారు. అమెరికాకు రావాలనుకునే పౌరుల నేరచరిత్రతోపాటు వాళ్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేసేందుకు అనుమతి చ్చే దేశాల సిటిజన్స్‌‌‌‌నే అమెరికాకు రానిస్తామన్నారు. 

ఒక్కరోజే 2,200 మంది అరెస్టు.. 

అక్రమ వలసదారులను అమెరికా అరెస్టు చేస్తున్నది. ఇలా మంగళవారం ఒక్కరోజే 2,200 మందిని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ అదుపులోకి తీసుకుంది. ఒకేరోజు ఇంతమందిని అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. రోజూ 3 వేల మందిని అరెస్టు చేయాలని వైట్‌‌‌‌హౌస్ నుంచి ఆదేశాలు వచ్చాయని, అందులో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయని మీడియా పేర్కొంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా, ప్రజా భద్రతకు ముప్పు లేనోళ్లను ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ (ఏటీడీ) ప్రోగ్రామ్‌‌‌‌ కింద ఎన్‌‌‌‌రోల్ చేసి.. అమెరికా అధికారులు ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటారు. అయితే ఇప్పుడు వాళ్లందరినీ ఆఫీసుకు పిలుస్తూ అరెస్టు చేస్తున్నారు.
 
హార్వర్డ్‌‌‌‌లో ఫారినర్స్‌‌‌‌కు నో ఎంట్రీ.. 

హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు అమెరికాకు ముప్పుగా పరిణమిస్తున్నారని, అందుకే నిషేధం విధిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఉత్తర్వులపై హార్వర్డ్ యూనివర్సిటీ మండిపడింది. విదేశీ విద్యార్థులను తాము కాపాడుకుంటామని తెలిపింది. కాగా, ట్రంప్ ఉత్తర్వులతో వివిధ దేశాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హార్వర్డ్‌‌‌‌లో చదువుకోవాలని వేచి చూస్తున్న ఇండియా, ఇతర దేశాల స్టూడెంట్లు అయోమయంలో పడ్డారు. 

టూరిస్టు వీసాకు వెయ్యి డాలర్లు!

టూరిస్టు వీసాకు వెయ్యి డాలర్లు వసూలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. అమెరికా టూరిస్టు వీసా ఇంటర్వ్యూకు ఫాస్ట్ ట్రాక్ ఫీజు పేరిట వెయ్యి డాలర్లు వసూలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, త్వరితగతిన ఇంటర్వ్యూలు నిర్వహించడం కోసం ధర పెంచితే న్యాయ వివాదాలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో యూఎస్ అధికారులు ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. టూరిస్ట్, ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాకు వచ్చే ప్రజలు ప్రస్తుతం ప్రాసెసింగ్ ఫీజు కింద 185 డాలర్లు చెల్లిస్తున్నారు. 

పైలెట్ ప్రాజెక్టుగా వచ్చే డిసెంబర్ నుంచి దీన్ని చేపట్టాలని అమెరికా ఆలోచన చేస్తోంది. కానీ, సర్వీస్ ప్రొవైడ్ ధర కంటే ఫీజు అధికంగా నిర్ణయించడం గతంలో చెప్పిన తీర్పుకు విరుద్ధమంటున్న న్యాయ నిపుణులు భవిష్యత్తులో దీనిని కోర్టు కొట్టివేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వైట్ హౌజ్ బడ్జెట్ కార్యాలయం  దీన్ని తిరస్కరించవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. కాగా, విదేశీ విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలు తనిఖీ చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అమెరికాలో చదవాలని కలలుకంటున్న విద్యార్థుల్లో బుగులు రేగుతోంది.