రఘురామ్ రాజన్, విరల్ ఆచార్య
ముంబై : బడా కార్పొరేట్లు, బిజినెస్ హౌస్లకు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వొచ్చనే ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ రికమెండేషన్ సరయినది కాదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య విమర్శించారు. ఈ ఐడియా చెడ్డదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. దాని వల్ల ఎకనమిక్ అండ్ పొలిటికల్ పవర్ కొన్ని బిజినెస్ హౌస్ల చేతిలోకి వెళ్లిపోతుందనే పేర్కొన్నారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, యెస్ బ్యాంక్లు కుప్పకూలిన అనుభవం నుంచి ఇండియా ఇంకా నేర్చుకుంటోందని, ఈ టైమ్లో పై నిర్ణయం తగినది కాదని పేర్కొన్నారు. రఘురామ్ రాజన్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్గా ఉండగా, విరల్ ఆచార్య స్టెర్న్ స్కూల్లో ప్రొఫెసర్గా ఉన్నారు. అయితే, బ్యాంకింగ్ రంగం మెరుగుపడేందుకు చేసిన కొన్ని ఇతర రికమెండేషన్స్ మాత్రం అనుసరించదగ్గవేనని చెప్పారు.
కొత్త రూల్స్కు తొందరెందుకు ?
బడా కార్పొరేట్లను బ్యాంకింగ్లోకి అనుమతించడాన్ని మాత్రం నిలిపివేయాలని సూచించారు. రూల్స్ను మార్చడానికి అంత తొందర పడాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. రెగ్యులేషన్, సూపర్వయిజన్ చట్టానికి సంబంధించినవే అయితే ఇండియాలో ఎన్పీఏ ప్రోబ్లమ్ వచ్చి ఉండేదే కాదని వ్యాఖ్యానించారు. లైసెన్స్లు తీసుకునే టైమ్లో సక్రమంగా ఉన్న ప్రమోటర్లు, ఆ తర్వాత కాలంలో చెడ్డవాళ్లుగా మారిన ఉదంతాలు ఉన్నాయని రాజన్, విరల్ పేర్కొన్నారు. బ్యాంకింగ్లో బడా కార్పొరేట్లను అనుమతించడంతోపాటు, ప్రమోటర్ల వాటాను ఇప్పుడున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచేలా ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేసింది. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్కు తగిన సవరణలు చేశాక ఈ రికమెండేషన్స్ను అమలు చేయాలని సూచించింది. పదేళ్లకు పైబడి కార్యకలాపాలు నిర్వహిస్తూ, రూ. 50 వేల కోట్లకు మించి ఎసెట్స్ ఉన్న ఎన్బీఎఫ్సీలను బ్యాంకులుగా మారేందుకూ అనుమతివ్వాలని సూచించింది. మరోవైపు గ్లోబల్ రేటింగ్ కంపెనీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ కూడా బ్యాంకింగ్లోకి కార్పొరేట్లను అనుమతించడం సరయినది కాదనే అభిప్రాయపడింది. ఇండియాలో కార్పొరేట్ గవర్నెన్స్ ఇంకా బలహీనంగానే ఉందని పేర్కొంది.
కార్పొరేట్ డిఫాల్ట్స్ పెరిగాయ్….
గత కొన్నేళ్లలో చాలా కార్పొరేట్ హౌస్లు అప్పులు తీర్చడంలో విఫలమవ్వడాన్ని ఈ సందర్భంగా ఎస్ అండ్ పీ ప్రస్తావించింది. ఫైనాన్షియల్ సెక్టార్ వీక్గా ఉన్నందువల్ల నాన్ ఫైనాన్షియల్ సెక్టార్లోని కంపెనీలను సూపర్వయిజ్ చేయడం ఆర్బీఐకి కష్టతరంగా మారుతుందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్లోకి కార్పొరేట్లను అనుమతించడం వల్ల ఎకనమిక్ పవర్ కేంద్రీకృతమవుతుందనే ఆందోళన వ్యక్తం చేసింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ విషయంలోనూ సమస్యలు వస్తాయని పేర్కొంది. కార్పొరేట్లకు బ్యాంకుల ఓనర్షిప్ కట్టబెడితే, ఇంటర్ గ్రూప్ లెండింగ్, నిధుల దారి మళ్లింపు వంటి ఇబ్బందులూ ఉంటాయని తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్కు కార్పొరేట్ చెల్లింపులలోనూ డిఫాల్ట్స్ పెరుగుతాయని అభిప్రాయపడింది. మార్చి 2020 నాటికి కార్పొరేట్ లోన్స్లో ఎన్పీఏలు 13 % ఉన్నాయని పేర్కొంది. బాగా నడుస్తున్న ఎన్బీఎఫ్సీలకు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడం మంచిదేనని తెలిపింది. యూనివర్సల్ బ్యాంక్స్ నెట్వర్త్ పరిమితిని రూ. వెయ్యి కోట్లకు పెంచడం మెరుగైన క్యాపిటలైజేషన్కు దారి తీస్తుందని అభిప్రాయపడింది. బాగా డబ్బున్న ప్రమోటర్లు మాత్రమే బ్యాంకింగ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంటర్నల్ గ్రూప్ రికమండేషన్స్పై ఆర్బీఐకి నో ఇంట్రెస్ట్?
తాజాగా పీఎంసీ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ల విషయంలో చోటు చేసుకున్న సమస్యలతో కొత్తగా బ్యాంక్ లైసెన్స్లను ఇవ్వడంలో ఆర్బీఐ వెనకడుగేయొచ్చని నిపుణులు అంటున్నారు. ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన రికమండేషన్లను సెంట్రల్ బ్యాంక్ సీరియస్గా తీసుకోకపోవచ్చని చెబుతున్నారు. బ్యాంకు లైసెన్స్లను ఇవ్వడం 2017 లోనే ప్రారంభించినా , ఇప్పటి వరకు ఏ ఎన్బీఎఫ్సీకి కూడా ఆర్బీఐ నుంచి బ్యాంక్ లైసెన్స్ దక్కలేదని గుర్తు చేస్తున్నారు. ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ రికమండేషన్స్పై సెంట్రల్ బ్యాంక్ పెద్దగా ఆసక్తి చూపలేదనే వార్తలు వెలువడడంతో ఫైనాన్షియల్ షేర్లు సోమవారం సెషన్లో తమ లాభాలను కోల్పోయాయి.