
- రేట్లతో ప్రజలకు ఇబ్బందులు రావద్దు
న్యూఢిల్లీ: ఒకవైపు విమాన టికెట్ల రేట్లను కంట్రోల్ చేసే ఉద్దేశమేదీ లేదని చెబుతూనే, మరోవైపు టికెట్ల రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచొద్దని ఎయిర్లైన్స్కు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ధరల రేంజ్లో ఎక్కువ తేడా లేకుండా చూడాలని సూచించింది. గో ఫస్ట్ఎయిర్లైన్స్ తన విమాన సర్వీసులను రద్దు చేసిన నేపథ్యంలో ఆ సంస్థ విమానాలు నడిపే రూట్లలో విమాన టికెట్ల రేట్లు బాగా పెరిగాయి. మరి కొన్ని రూట్లలోనూ రేట్ల పెరుగుదల కనబడినా, గో ఫస్ట్ నడిపే రూట్లలో ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.
ఉదాహరణకు చూస్తే ఢిల్లీ – శ్రీనగర్, ఢిల్లీ – పుణెల మధ్య విమాన టికెట్ల రేట్లు చుక్కలంటుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత విమానయానం ఇటీవలి నెలల్లోనే జోరందుకుంది. ఇలాంటి టైములో గో ఫస్ట్ వాలంటరీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసి, సర్వీసులను రద్దు చేయడం వల్ల సీట్లకు కొరత ఏర్పడుతోంది. టికెట్ల రేట్ల నిర్ణయంలో బ్యాలెన్స్ పాటించాలని ఎయిర్లైన్స్ కంపెనీలకు స్పష్టం చేసినట్లు సివిల్ ఏవియేషన్ సీనియర్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. అధిక రేట్ల వల్ల పాసింజర్లు ఇబ్బందులు పడే పరిస్థితులు రాకుండా చూడాల్సిందిగా కోరినట్లు పేర్కొన్నారు. ఇదే టైములో ఎయిర్లైన్స్ టికెట్ల రేట్లను నియంత్రించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని కూడా ఆ సీనియర్ ఆఫీసర్ చెప్పారు.
జూన్లో పీక్ ట్రావెల్ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో గో ఫస్ట్ తన సర్వీసులను మళ్లీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందుబాటులోకి తేవడం మేలని ఆయన పేర్కొన్నారు. ఎయిర్లైన్స్ సెక్టార్ను డీరెగ్యులేట్ చేసినప్పటి నుంచీ విమాన టికెట్ల రేట్లను సూచించడం లేదా వాటిని నియంత్రించడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవడం లేదు. గ్లోబల్గా పాటించే ప్రమాణాల ప్రకారమే మార్కెట్ ఆధారంగా విమాన టికెట్ల రేట్లను కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. మార్కెట్, డిమాండ్, సీజనాలిటీతో పాటు, కొన్ని ఇతర మార్కెట్ పరిస్థితులను బట్టి విమాన కంపెనీలు తమ టికెట్ల రేట్లను ఫిక్స్చేస్తున్నాయి.